చిత్ర పరిశ్రమలో మంచి సినిమాలు చేసిన చాలామంది సీనియర్ నటులు ప్రేక్షకులను బాగా ఆకట్టున్న వాళ్ళే. ఇలాంటి వాళ్ళని చూస్తే ఎవరికైనా వీళ్ళలా ఉండాలి జీవితం అనుకుంటారు. కాని వారి కష్ఠాలు చెప్పతరం కాదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారన్న విషయం చాలా అరుదుగా బయటకి వస్తుంది. వెండితెరమీద వెలుగుతున్న వాళ్ళందరి బతుకులు బ్రహ్మండంగా ఉండవు. వీళ్ళు ఒక్కోసారి షూటింగ్స్ లేకపోతే మింగను మెతుకే కరువవుతుంది. మొహానికి రంగేసుకొని జనాలని ఆకట్టుకుంటారంతే. మొహానికి ఉన్న ఆ రంగు తీసేస్తే వీళ్ళ అసలు రంగు బయటపడుతుంది. కళ్ళారా చూస్తే కన్నీళ్ళు కట్టలు తెంచుకొని వస్తాయి. ఇందుకు హీరోయిన్స్ కూడా ఏమాత్రం మినహాయింపు కాదు.
పాయిల్ ఘోష్ టాలీవుడ్ లో హీరోయిన్ గా చిన్న సినిమాలు చేసింది. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిందే. మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం అనే సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. చెప్పాలంటే ఈ సినిమా మంచి పేరుని సంపాదించుకుంది. కమర్షియల్ సక్సస్ కాకపోయినప్పటికి మనోజ్ తో పాటు హీరోయిన్ పాయిల్ ఘోష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమన్న భాటియా నటించిన ఊసరవెల్లి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి పాపులర్ అయింది. ఈ సినిమాతో బాగానే గుర్తింపు తెచ్చుకున్న పాయిల్ ఘోష్ తెలుగులో నాలుగైదు సినిమాలు చేసింది.
అయితే హీరోయిన్ గా అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయింది. సినిమా అవకాశాలు కంప్లీట్ గా సున్నా. కొంతమందికి సీరియల్స్ లో అవకాశం వస్తుంది. కాని పాయిల్ ఘోష్ కి అవి కూడా రాలేదు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో తను ఎదుర్కొంటున్న కష్టనష్టాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారామె. "పనిలేదు. జీవితం, ప్రయాణాలు లేవు. పైసా ఆదాయం లేదు. ఆర్థికంగా చితికిపోతున్నాం. ఇలాంటి జీవితాన్ని కనీసం కలలో కూడా ఊహించుకోలేదు. ప్రస్తుతం మనలో ఏ ఒక్కరి జీవితాలు పూలపాన్పులు కాదు. పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవాల్సిందే. లాక్డౌన్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు తోటి వారు సురక్షితంగా ఉండేలా చూసుకునే బాధ్యత కూడా మనదే" అని విన్నపించారు. హీరోయిన్ గా చేసిన తన పరిస్థితే ఇలా ఉంటే ఇక రోజువారీ కూలీల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.