దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్.ఆర్.ఆర్)... ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' రోల్ పోసిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్లోకి వెళ్లింది. అయితే కొంతమంది ఈ లాక్ డౌన్ సమయాన్ని సైలెంటుగా చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వాడుకోవాలని భావిస్తున్నారట. అందులో 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర యూనిట్ కూడా ఉంది.
కరోనా ఎఫెక్ట్ ఇప్పుడే తగ్గే అవకాశం కనిపించకపోవడంతో నెక్స్ట్ షెడ్యూల్ కి టైం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని రాజమౌళి కూడా క్లారిటీ ఇచ్చేశాడట. ప్రపంచంలోని వివిధ ప్రముఖ స్టూడియోలకు ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు అప్పగించారని సమాచారం. అందులో కొన్ని లాక్ డౌన్ వల్ల పనులు చేయడం లేదట. అయితే కొన్ని సంస్థలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తుంటాయి కదా. అలాంటి సంస్థల్లో 'ఆర్.ఆర్.ఆర్' వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయట. రాజమౌళి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనకు ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలో అవన్నీ ఆన్ లైన్ ద్వారానే చెబుతున్నాడట. ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయిందని.. అనుకున్న సమయానికే సినిమాని విడుదల చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశాడట రాజమౌళి.
కాగా ఇప్పటికే చరణ్ పుట్టిన రోజు కానుకగా 'భీమ్ పర్ రామరాజు' పేరుతో విడుదల చేసిన రామ్ చరణ్ ఇంట్రో వీడియో భారీ ఆదరణ దక్కించుకుంది. చరణ్ పరిచయ వీడియోకి ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ వీడియో 'రామరాజు ఫర్ భీమ్' ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకు సంబంధించిన పనులూ జరుగుతున్నాయట. దీనితో ఫ్యాన్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది.