దర్శకధీరుడు రాజమౌళి.. టాలీవుడ్లో ఈయనకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా లెక్కలు అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచం మొత్తం మన చిత్ర పరిశ్రమ గురించే మాట్లాడుకొనేలా చేసిన ఘనత ఈయనది. ముఖ్యంగా సౌత్ సినిమాలను చిన్న చూపు చూసిన బాలీవుడ్ వారినే తలదన్నేలా సినిమాను తెరకెక్కించిన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో మెగాఫోన్ చేతపట్టిన ఆయన హిట్టు వదలని విక్రమార్కుడు అనిపించుకొన్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’ సినిమాతో బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుస్తున్నారు. రిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఖాళీగానే ఉంటున్న రాజమౌలి వివిధ మీడియా సంస్థలతో ముచ్చటిస్తున్నారు.
ఈ సంధర్భంగా రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న వేళ ఎన్నో ప్రాణాలు బలి అవుతున్నాయి. లక్షల మంది కరోనా సోకి హాస్పటల్లో పోరాడుతున్నారు. కరోనా విషయంలో కంప్లీట్గా క్లోజ్ అయిన దారి అయితే కాదు.. లాక్డౌన్ ఎత్తేశాక కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుని ముందుకు వెళ్లాలి. రెక్కాడితే డొక్కాడని కార్మికులు కాని... కూలీలు కాని వీళ్లు ఎలా బతుకుతారు అన్న భయం మాత్రం ఉంది. ఏ రోజు కు ఆ రోజు పని చేసి సాయంత్రానికి సరుకులు తెచ్చుకునే వాళ్ల పరిస్థితి అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.