బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది అందరికి ఆసక్తిగా మారిన వేళ రాజమౌళి అనూహ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్.ఆర్.ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ఓ ఛానెల్ లైవ్లో రాజమౌళిని బాలీవుడ్ హీరోలతో సినిమా ఎప్పుడు అని అడిగారు ? అమీర్ఖాన్తో సినిమా ఉంటుందా ? అన్న ఛానెల్ యాంకర్ ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ ఓ మంచి హీరోతో చేయాలని దర్శకుడికి ఎలా ఉంటుందో ? ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్తో చేయాలని హీరోలకు కూడా ఉంటుంది.. ఇద్దరికి మంచి సబ్జెక్ట్ దొరకాలి.. మంచి నిర్మాత.. డీల్స్ ఉండాలన్నారు.
వీటితో పాటు దర్శకుడు - హీరో కాంబో సెట్ కావడానికి అనేక కారణాలు ఉంటాయని చెప్పారు. బాలీవుడ్లో చాలా మంది హీరోలు తనతో సినిమా చేసేందుకు ఆసక్తితో ఉన్నారని చెప్పారు. ఇక గతంలో నాకు దొరికిన సబ్జెక్ట్కు సునీల్ దగ్గరకు వెళ్లి తానే సినిమా చేయాలని అడిగానని చెప్పారు. అలాగే ఈగ సినిమా కోసం నానిని నేనే వెళ్లి అడిగానని చెప్పారు. నాకు తయారైన సబ్జెక్ట్కు ఎవరు బాగుంటారో నేనే వెళ్లి వాళ్లను అడిగి సినిమా చేస్తానని రాజమౌళి చెప్పారు. ఇక బాలీవుడ్ హీరోలు కూడా తనతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని.. టైం వచ్చినప్పుడు బాలీవుడ్ సినిమా ఉంటుందని చెప్పారు.