కరోనా మహమ్మారి గురించి జనం మరీ భయపడిపోతుండటానికి ఓ కారణం.. పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలితే పద్ధతిగా అంత్యక్రియలు కూడా జరుపుకునే అవకాశం లేకపోవడం. కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని తాకే అవకాశం ఉండదు. కరోనా ఎంతగా భయపెడుతుందంటే.. వైద్యం చేసిన డాక్టర్లకు కరోనా వచ్చిందంటే వారిని నుంచి దూరంగా జరుగుతున్నారు.. చనిపోతే ఖననం చేయలేని పరిస్థితి నెలకొంది. సన్నిహితులు కూడా అంత్యక్రియలకు హాజరు కాలేరు. సాయం పట్టడానికి కూడా మనుషులు లేని దైన్యాన్ని చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్ల తమ ప్రాంతాల్లో కరోనా మృతుల్ని ఖననం చేయడానికి కూడా జనాలు అంగీకరించని పరిస్థితి కనిపిస్తోంది.
తమిళనాడులో ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది. పరిస్థితి విషమించి ఆదివారం ఆయన మృతి చెందాడు. వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. స్థానికులు వ్యతిరేకించారు. తాజాగా దీనిపై స్పందించిన నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్ కరోనా మృతుల్ని ఖననం చేయడానికి తన కాలేజీలో స్థలం ఇస్తానని ముందుకొచ్చారు. విజయ్కాంత్కు చెన్నై శివారల్లో ఆండాళ్ అళగర్ పేరుతో ఇంజినీరింగ్ కళాశాల ఉంది.
దీని ప్రాంగణంలోని కొంత భాగాన్ని కరోనా మృతుల ఖననానికి ఇస్తానని విజయ్ కాంత్ ప్రకటించారు. అయితే విజయ్ కాంత్ ఔదార్యంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన పెద్ద మనసును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు.ఎంత మంది హీరోలు ఎన్ని కోట్లు అయినా విరాళాలు ఇచ్చి ఉండొచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు ఎంతో నిధులు గుమ్మరించి ఉండొచ్చు. కానీ కరోనా వేళ తమిళ మాజీ హీరో, రాజకీయ నాయకుడు విజయకాంత్ చూపిన ఉదారత ఎన్నటికీ మరువలేనిది. కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి ఖననానికి స్థలం ఇస్తానని చెప్పిన ఆయన మంచి మనసును మెచ్చుకుంటూ సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు.