ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రస్తుతం బయోపిక్స్ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే మన ఇండస్ట్రీలలో చాలా బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో లాస్ట్ ఇయర్ 'సాండ్ కీ ఆంఖ్' బయోపిక్ చిత్రంలో నటించిన తాప్సి మరో బయోపిక్ లోనూ నటిస్తోంది. గుజరాత్ అథ్లెట్ రష్మీ జీవితం ఆధారంగా దర్శకుడు ఆకర్ష్ ఖురాన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'రష్మీ రాకెట్'. ఈ చిత్రంలో తాప్సి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో తాప్సీ భర్తగా ఆర్మీ ఆఫీసర్గా ప్రియాన్షు పైన్యూలి నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. రష్మీ తన పరుగుతో ఎన్నో విజయాలను.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇందుకుగానూ గుజరాత్ ప్రజలు రష్మీని 'రాకెట్' అని పిలుస్తుంటారు. దీన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు 'రష్మీ రాకెట్' పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కరోనా కారణంగా నిలుపుదల చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం తాప్సి బాగానే కష్టపడుతోందట. రష్మీ పాత్ర కోసం తాప్సీ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. అదీ ఒక్కరితో కాదు.. ఏకకాలంలో నలుగురి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటోంది. ఒక ట్రైనర్ వేగంగా ఎలా పెరిగెట్టాలో చెబుతూ 'స్ప్రింట్'లో మెళకువలు ఇస్తున్నారు.. ట్రాక్ అథ్లెట్స్ కి ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట. మరొక ట్రైనర్ ప్రొఫెషనల్ స్ప్రింటర్స్ కి అవసరమైన శారీరక ధారుడ్యం కోసం ఆమెకు శిక్షణ ఇస్తున్నారు.. అంటే మజిల్స్ పెంచే పనిలో తాప్సీ పడ్డారు. ఇంకొకరు న్యూట్రీషనిస్ట్.. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు. మరొకరు ఫిజియోథెరపిస్ట్.. ట్రైనింగ్ లో గాయాలు కాకుండా చూసుకుంటారు. నెల రోజుల్లో ప్రొఫెషనల్ అథ్లెట్ ఫిజిక్ లోకి వస్తానని తాప్సీ అంటున్నది. మరి ఇంత కష్టపడుతున్న తాప్సికి ఈ 'రష్మీ రాకెట్' సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో 'ఝుమ్మంది నాదం' సినిమాతో అరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ సొట్టబుగ్గల సుందరి. టాలీవుడ్ లో చాలా హిట్ సినిమాలు చేసింది. మిస్టర్ పర్ఫెక్ట్, వీర, ఆనందో బ్రహ్మ, గంగ, నీవెవరో సినిమాలతో పాటు వెంకటేష్ లాంటి పెద్ద స్టార్స్ తో కూడా నటించింది. కానీ అమ్మడు తెలుగులో కంటే హిందీలోనే మంచి గుర్తింపు సాధించింది. 2010లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తాప్సి 2020లో తన మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. 2019 అక్టోబర్ నెలలో విడుదలైన 'సాండ్ కి ఆంఖ్' సినిమాలో తాప్సి చేసిన పాత్రను ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది.