టాలీవుడ్ లో తన సినిమాలతో కోట్ల మంది ప్రశంసలు సొంతం చేసుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెం.1 నుంచి తన ప్రస్థానం మొదలు పెట్టి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోకుండి దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. ఇక బాహుబలి, బాహుబలి 2 మూవీస్ తో జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందారు. టాలీవుడ్ రేంజ్ ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు టాలీవుడ్ జాతీయస్థాయి ఖ్యాతి పొందింది. స్టార్ హీరోల సినిమాలు జాతీయ స్థాయిలో రూపొందుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ కే కలెక్షన్ల రికార్డులు ఉండేవి.. కానీ బాహుబలి 2 తో అది కాస్త బ్రేక్ అయ్యింది. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఉగాదికి ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ ఆర్ ఆర్) మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. గ్రాఫిక్ మాయాజాలంతో ఇది ఒక ట్రెండ్ సృష్టించింది. ఇదిలా ఉంటే రాజమౌళి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన సోదరుడు ఎం ఎం కీరవాణి. తాజాగాఓ ఇంటర్వ్యూలో రాజమౌళిని గురించి కీరవాణి మాట్లాడుతూ.. తనలో నచ్చిన.. నచ్చని అంశాల గురించి మాట్లాడారు. మొదటి నుంచి కూడా రాజమౌళికి పట్టుదల ఎక్కువ. ఒక విషయాన్ని మనసులో అనుకుంటే దానిని సాధించేవరకూ పోరాడుతూనే ఉంటాడు. తాను ఏ విషయంలోనూ అంత త్వరగా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు.. అందుకే విజయం అతన్ని వరిస్తుంది.
చిన్ననాటి నుంచి రాజమౌళికి ఏకాగ్రత ఎక్కవ.. అందుకే ఆ పనిని తాను ఎంత పెర్ఫెక్ట్ గా చేయగలననే దానిపైనే దృష్టి పెడతాడు. ఇక ఆయనలో నచ్చని అంశం ఒక్కటే.. ఎక్కువగా చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తుంటాడు.. సినిమాలు, కార్టూన్లు చూస్తూ ఉంటాడు. ఇలా చేయొద్దని చెప్పినా అప్పటి వరకు తల ఊపి తర్వాత ఓ పక్కకు వెళ్లి మళ్లీ అలాంటి సినిమలే చూస్తుంటాడు. ఇది తనలో నాకు అస్సలు నచ్చని అంశం అంటూ నవ్వేశారు.