ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత విజయనిర్మల, సూపర్ స్టార్ కృష్ణ దంపతులకు నరేష్ కుమారుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నరేష్ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక తల్లి విజయనిర్మల ప్రోత్సాహం ఎంతో ఉంది అన్న విషయం కూడా తెలిసిందే. బాలనటుడిగా 1972లో `పండంటి కాపురం` చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నరేష్.. 1982 లో తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో `ప్రేమ సంకెళ్ళు` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోగానే కాకుండా మంచి హాస్య నటుడిగా కూడా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నాడీయన.
ముఖ్యంగా నరేష్ హీరోగా నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించడంతో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇక తర్వాత ఈయన హీరోగా వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం నరేష్ రాజకీయాల్లో కూడా చేరి,సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా తనదైన శైలిలో వెళ్తున్నాడు. మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉంటున్నారు. అయితే నరేష్ పర్సనల్ విషయాల గురించి చాలా మందికి తెలియదు. నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు.
తర్వాత రెండో పెళ్ళి చేసుకున్న నరేష్.. ఆమెకు కూడా ఏవో మనస్ఫర్ధల కారణంగా విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా మొదటి రెండు పెళ్లిళ్లు మనస్ఫర్ధల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. ఇక 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3 న హిందూపురంలో వివాహం చేసుకున్నాడు. పెద్ద కొడుకు హీరోగా పరిచయం కాగా, మిగిలిన ఇద్దరూ కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా, నరేష్ గతంలో భారతీయ జనతా పార్టీలో చేరి కొంతకాలం చురుకైన పాత్ర పోషించాడు. యువ నాయకుడి నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. 2009లో పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపిని వదిలిపెట్టాడు.