బాలీవుడ్ లో నేడు విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఈ రోజు తుది శ్వాస విడిచి బాలీవుడ్ను కన్నీటి సంద్రంలోకి నెట్టేశారు. కేన్సర్ బారినపడిన ఆయన కోలుకున్నప్పటికీ అనూహ్యంగా పేగు ఇన్ఫెక్షన్తో బాధపడుతుతూ మృతి చెందారు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ లో కూడా నటించి మెప్పించారు. ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన ఇర్ఫాన్ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఇర్ఫాన్ ఖాన్ 2011లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకునేంత వరకు ఎదిగారు.
ఏడాది మార్చి 13న ఆయన నటించిన చివరి చిత్రం ‘ఆంగ్రేజీ మీడియం’ విడుదలైంది. అయితే, లాక్డౌన్ కారణంగా ఆ చిత్రానికి ఆదరణ లభించలేదు. ఆంగ్రేజీ మీడియం సినిమా విడుదలకు ముందు ఇర్ఫాన్ మాట్లాడుతూ.. తన భార్య కోసమైనా బతకాలని ఉందని అన్నారు. తనకు కేన్సర్ సోకిన విషయం తెలిసిన తర్వాత 24 గంటలూ తనతోనే ఉందని, తనను అత్యంత జాగ్రత్తగా చూసుకుందని అన్నారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందడానికి కొన్ని క్షణాల ముందు ఆయన మాట్లాడిన మాటలు గుండెలను పిండేస్తున్నాయి. ‘‘నన్ను తీసుకెళ్లేందుకు మా అమ్మ వచ్చింది’’ అని ఆయన అన్నట్టు ఆ సమయంలో ఇర్ఫాన్ పక్కన ఉన్నవారు పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) మృతి చెందారు.
ఆమె అంత్యక్రియలకు వెళ్లలేక పోయిన ఇర్ఫాన్ ఎంతో కృంగిపోయారట. ఈ ఘటన ఆయనను మరింత బాధ పెట్టేలా చేసింది. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. . పేగు ఇన్ఫెక్షన్తో ఇటీవల ముంబైలో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన 53 ఏళ్ల ఇర్ఫాన్ అంతలోనే మృతి చెందడం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది.