టాలీవుడ్ లో మాస్ మహరాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ‘బెంగాల్ టైగర్’ మూవీ తర్వాత రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  ఆ సమయంలో ఆయనపై రక రకాల రూమర్లు కూడా వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.  ఈ మూవీలో పూర్తిగా అంధుడిగా నటించినా హీరోయిజం ఎక్కడా డ్యామేజ్ కాకుండా రవితేజ తనదైన మానరీజంతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచాడు.  దాంతో మాస్ మహరాజా ఈజ్ బ్యాక్ అన్నారు.  కానీ రవితేజ నటించిన సినిమాలు వరుసగా నాలుగు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో ఈసారి మంచి హిట్ కోసం పాత దర్శకుడిని నమ్ముకున్నాడు.  

 

గతంలో తనకు బలుపు లాంటి సూపర్ హిట్ అందించిన గోపిచంద్ మలినేనితో ‘క్రాక్’ మూవీలో నటిస్తున్నాడు. అదీ కాకుండా తనకు అచ్చోచ్చిన పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.  వాస్తవిక స్టోరీ ఆధారంగా ఈ మూవీ రూపొందుతుందని టాక్.  ఈ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్ నటిస్తుంది మరో ముఖ్యపాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుంది. చిత్రీకరణ పరంగా ముగింపుదశకి చేరుకున్న ఈ సినిమా, లాక్ డౌన్ తరువాత చకచకా మిగిలిన పనులను పూర్తిచేయనుంది.  ఈ మూవీ తర్వాత రవితేజ.. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

 

వాస్తవానికి  నక్కిన త్రినాథరావు ఈ కథను వెంకటేశ్ ను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేశాడట. కానీ స్టోరీ లైన్ విన్న తర్వాత వెంకటేష్ పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. దాంతో త్రినాథరావు ఆ కథను రవితేజకు వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. అయితే రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీలో మార్పులు చేర్పులు చేశారట  నక్కిన త్రినాథరావు. ఇక 'రాక్షసుడు' సినిమాతో హిట్ కొట్టిన రమేశ్ వర్మ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: