టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు హైకోర్టులో చుక్కెదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గంలోని 2,083 చదరపు గజాల స్థలంలో ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. భూమి కొనుగోలుకు సంబంధించిన డాకుమెంట్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ భూమి తమదే అంటూ స్వాధీనం చేసుకుందని పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా జరిగిన విచారణలో ఈ స్థలంలోని నిర్మాణాలపై స్టేట్సకో పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ స్థల వివాదానికి సంబంధించి గత ఏడాది ఏప్రిల్ 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం ప్రస్తావించింది.
ఈ ఆదేశాల ప్రకారం అధికారులు సీజ్చేసిన ఆస్తులపై స్టేట్సకో పాటించాలని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. అలాగే ఆ ఆస్తిని పిటిషనర్ కు స్వాధీన పరచాల్సిన అవసరం లేదని, వాటిని రెవెన్యూ అధికారుల ఆధినంలో ఉంచాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. స్థల యాజమాన్య హక్కుల కోసం సివిల్ కోర్టులో న్యాయపోరాటం చేయవచ్చని ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి ఇంజంక్ష న్ ఉత్తర్వులు తెచ్చుకుని ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి ట్రై చేశారు. దీంతో అధికారులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలే అమల్లో ఉంటాయని వెల్లడించింది.
మరియు జిల్లా కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్ ఆదేశాలపై దాఖలు చేసిన స్టే వెకేట్ పిటిషన్తో సహా భూవివాద వ్యాజ్యాలను సత్వరమే పరిష్కరించాలని సూచించింది. కాగా, రంగారెడ్డి జిల్లాలోని పన్మక్త గ్రామంలో పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేశారు ప్రభాస్. అయితే.. ఆ భూమికి సంబంధించిన అసలు యజమానిని తానేనని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అదే సమయంలో ప్రభాస్ కొనుగోలు చేసిన భూమిని స్వాధీనం చేసుకుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. అంతేకాదు.. భూమిలో నుంచి ప్రభాస్ ను ఖాళీ చేయించి..తాళాలు వేసింది. ఈ అంశంపై తనకు న్యాయం చేయాలంటూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు.