రిషి కపూర్ - నీతూ జంట దాదాపు 15 చిత్రాల్లో కలిసి నటించిన ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రిషీ - నీతూ కపూర్లు కలిసి నటించిన 1974 చిత్రం ‘జరీలా ఇన్సాన్’ సెట్స్లో వారికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ 1980లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి 40 ఏళ్లు జీవనం సాగించారు. వీరికి రణబీర్ కపూర్ - రిథిమాకపూర్ సంతానం ఉన్నారు. రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు కాగా.. రిద్ధిమా డిజైనర్గా స్థిరపడింది. రియల్ లైఫ్ లోనే కాదు.. రీల్ లైఫ్ లో కూడా వీరిది సూపర్ హిట్ జోడీ. ఎన్నో సూపర్హిట్ బాలీవుడ్ చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులను అలరించింది. రిషీ కపూర్ క్యాన్సర్తో రేండేళ్లుగా పోరాటం చేసి చివరకు గురువారం ఉదయం మృతి చెందారు. కాగా ఆయన భార్య నితూ కపూర్ ఆయనకు వీడ్కోలు చెబుతూ భావోద్వేగ పోస్టును శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. మందు గ్లాసు పట్టుకుని.. చిరునవ్వు చిందిస్తున్న రిషీ కపూర్ ఫొటోకు ‘మన కథ ముగిసింది’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఆమె పోస్టు చూసిన నెటిజన్లు రిషీ కపూర్కు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
రిషి కపూర్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో నీతూ ఆయన పక్కనే ఉన్నారు. ఆయన కోలుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలే చేశారు. ముఖ్యంగా రిషిలో నీతూ ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఇక రిషి ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో అతడి కోసం అమ్మలా మారానని ఆ మధ్యన ఓ ఇంటర్య్యూలో వెల్లడించారు నీతూ. ”రిషి కోసం నేను అమ్మలా మారా. నా మూడో బిడ్డలా రిషిని చూసుకున్నా. తినిపించడం, పడుకోబెట్టడం, మందులు ఇవ్వడం.. ఇలా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్లుగా చూసుకున్నా. ట్రీట్మెంట్ సమయంలో ఆయన అస్సలు తినేవారు కాదు. అది నన్ను చాలా బాధించింది. దీంతో ఆయన తినడం కోసం చాలా ట్రిక్స్ ప్లే చేశా. ఫలానా రెస్టారెంట్లో అది బావుంటుంది, ఇది బావుంటుంది అని అక్కడి నర్సులతో చెప్పించేదాన్ని. వారు చెప్పినప్పుడు అవునా.. మనం ట్రై చేద్దామా..? అని నన్ను అడిగేవారు” అని నీతూ కపూర్ చెప్పుకొచ్చింది. కాగా క్యాన్సర్ బారిన పడిన రిషి కపూర్.. తీవ్ర అస్వస్థతకు గురై గురువారం తుదిశ్వాస విడిచారు.