వెండితెర మీద సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించడంలో టాలీవుడ్ లో శేఖర్ కమ్ములని మించిన దర్శకుడు లేడని చెప్పవచ్చు. హ్యాపీడేస్ మొదలుకుని మొన్న వచ్చిన ఫిదా వరకూ దాదాపుగా అన్ని చిత్రాలు ప్రేమ కథా చిత్రాలే. అయితే చాలా వరకూ శేఖర్ కమ్ముల తీసిన ప్రేమకథలు బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. ఆయన సినిమాల్లో ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. హీరోలే హీరోయిన్ల వెంట పడుతుంటారు.

 


హీరోయిన్ల క్యారెక్టర్లని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తుంటారు. అందుకే శేఖర్ కమ్ముల సినిమాల్లో నటించడానికి హీరోయిన్లు ఆసక్తి చూపిస్తుంటారు. సినిమాల్లోనూ హీరోయిన్ల క్యారెక్టర్లే ఎక్కువ హైలైట్ అవుతుంటాయి. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ, సాయిపల్లవిదే డామినేషన్ కనిపించింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

 

 

ఈ వేసవిలో విడుదల కావాల్సిన లవ్ స్టోరీ, లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయి విడుదల వాయిదా పడింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత థియేటర్లు తెరుచుకుంటే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల లాక్డౌన్ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాడట. ఈ లాక్డౌన్ టైమ్ లో స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాడు. అయితే ప్రేమ కథల్ని మరింత అందంగా చెప్పే శేఖర్ కమ్ముల, తన దారిని వదులుకుని థ్రిల్లర్ కథని రాస్తున్నాడట.

 

ఇదివరకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన థ్రిల్లర్ చిత్రం అనామిక ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన కహానీ సినిమాకి రీమేక్ అది. తన జోనర్ ని విడిచిపెట్టి పొలిటికల్ థ్రిల్లర్ అయిన లీడర్ కి మంచి పేరు వచ్చినప్పటికీ, కమర్షియల్ వర్కౌట్ కాలేదని విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు రాస్తున్న థ్రిల్లర్ తోనైనా హిట్ కొడతాడేమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: