కేవలం కళ్ళతోనే హావభావాలని పలికించేస్తది. కనుసైగతో కోటి కళలు పండించగల మహానటీమణి, వెండితెరకి మహారాణి, నటనకు శిరోమణి అయిన ఓ బంగారు బొమ్మ సినీ జగతిలో ఆవిడ ప్రయాణం మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఒక అందం అద్భుతమై కొన్ని దశాబ్దాలుగా వెండితెర వేలుపు అయితే ఆ అద్భుతం సావిత్రమ్మే. బయోపిక్ గా మారి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ విజయం ‘అమ్మాడి’ అయ్యుంటుంది. ఈనాటికి ఎందరి కలల లోనో ఆమె మహారాణి. ఆనాటి వారిని కదిలిస్తే సావిత్రి ఒక అద్భుతమేనమ్మా మీకేమి తెలుసు ఆ పసితనం వీడని బంగారు బొమ్మని చూడడానికి థియేటర్ లకు ఎన్నిసార్లు ప్రేక్షకులు వెళ్లుంటారో అని మనసు నిండుగా ఆస్వాదిస్తూ ఆమె కబుర్లే. కళ్ళతోనే అభినయించిన ఏకైక వెండి తెర అభినేత్రి మహానటి సావిత్రి. అమాయకత్వం, ప్రేమ, దయ ఏకకాలంలో కురిపించే నేత్రాలు సావిత్రమ్మవి.
జెమినిగణేషన్, పెద్ద పెద్ద హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. అంత పెద్ద క్రేజ్ ఉన్న సావిత్రికి చాలా జాలి గుణం ఎక్కువ. అలాగే అందరినీ ఎక్కువగా గుడ్డిగా నమ్ముతుంది. ఎంతో అమాయకంగా అందరినీ నమ్మబట్టే ఆమె జీవితం అలా అయిపోయిందని అందరూ అంటుంటారు. ఆమె వివాహమాడిన జెమిని గణేష్న్ని కూడా పెళ్ళి చేసుకునే సమయానికే ఇద్దరు పిల్లలు భార్య ఉన్నప్పటికీ ఆమె ఇష్టపడి చేసుకున్నారు. అంటే దీన్నిబట్టే ఆమె ఎంత అమాయకురాలంది ఆలోచించవచ్చు. మహనీయుల్ని మర్చిపోలేము ఏ రంగం లో అయినా. అందర్నీ అలరించే సినీ రంగంలో ఒక తెరిచిన పుస్తకం సావిత్రమ్మ జీవితం.
అందరూ ఆచరనీయులే అయినా ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఎవరైనా సినీ ఇండస్ట్రీ లో మీకు నచ్చిన మీరు మెచ్చిన నటి ఎవరైనా ఉన్నారా అని తెలుగువాళ్ళని అడిగితే చెప్పుకోక తప్పని పేరు మహానటి సావిత్రిది. ఆ విధంగా తెలుగువాళ్ళకి అభినయకళాపరంగా ఒక గొప్ప వారసత్వాన్ని ప్రసాదించి మన సంస్కృతిని పరిపుష్టం చేసిపోయిన మహామహురాలు ఆమె. సావిత్రీ, ఆమె అక్క ఇద్దరూ కస్తూరీబాయి మెమోరియల్ స్కూల్కి వెళ్లేవారు. వాళ్ళు బడికేళ్ళే దార్లో ఓ డాన్సు స్కూలుండేది. తిరిగొచ్చేటపుడు నాట్యం చూసే పిల్లల్ని చూసేది సావిత్రి. ఎవరూ నేర్పకుండానే 8 ఏళ్లకే నాట్యగత్తెలా మెడతిప్పటం వచ్చేసింది. ఆ చిన్నవయసులోనే చూసినవారెవ్వరూ సావిత్రిమీదనుంచి చూపు మరల్చుకునేవారు కారు.