కరోనా కోరలు చాచిన వేళ ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నానాటికీ ప్రభావం వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ముఖ్యమంత్రాలు లాక్డౌన్ను పొడిగించుకుంటూ వెళుతున్నారు. లాక్ డౌన్ తో సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. థియేటర్లు మూత పడ్డాయి. షూటింగ్ లు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ నిలిచిపోయాయి. ఇలా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. అలా జరగడంతో టాలీవుడ్ ఇప్పటి వరకూ 600 కోట్ల వరకూ నష్టపోయిందని ఓ అంచనా. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితి నెలకొనలేదు. ఇక బాలీవుడ్ ఎంతగా నష్టపోతుందా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లోనూ నష్టాలు అంతకు మించే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం మే 4 నుంచి కొన్ని పరిశ్రమలకు మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనుమతులు జారీ చేసింది. సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవచ్చని అనుమతిచ్చింది.
ఈ నేపథ్యంలో కోలీవుడ్ పరిశ్రమ షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. సినీ పరిశ్రమ, బుల్లి తెర పరిశ్రమలకు అనుమతులివ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనీస్వామి ని పెఫ్సీ అధ్యక్షుడు ఆర్. కె. సెల్వమణి వినతి పత్రాన్ని అందజేసారు. లాక్ డౌన్ తో పరిశ్రమలో పనులు నిలిచిపోయాయని..ఇప్పటికే 50 రోజులు పూర్తయిందని లేఖలో పేర్కొన్నారు. ఒకప్పుడు 100 రోజులు.. సిల్వర్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ కార్యక్రమాలతో కళకళలాడిన పరిశ్రమ ఇప్పుడు లాక్ డౌన్ తో 50 రోజులు అని చెప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ముందుగా రీ రికార్డింగ్..డబ్బింగ్.. అలాగే బుల్లి తెర పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
తద్వారా 50 శాతం కార్మికులకు ఉఫాది దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. అలా చేయడం వల్ల కొన్ని ఆకలి కష్టలైనా తీరుతాయన్నారు. సామాజిక దూరం పాటిస్తూనే పనులు చేసుకోవడానికి వెసులు బాటు కల్పించాలని కోరారు. మరి ఈ వినతిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా? స్పందిస్తాయో చూడాలి. ఇక సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వందల మంది కార్మికులు పనిచేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఉపాధి దొరుకుతుంది కానీ మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని మరో పక్క వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలైతే మరో ఆరు నెలల పాటు థియేటర్లు ఓపెన్ చేసే అవకాశం కనిపించలేదని ప్రభుత్వం కంటే ముందుగానే చెప్పారు. అయితే ఇక్కడా షూటింగ్ లకు సంబంధించి అనుమతు లు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.