మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ దశలోనే ఉండగానే చిరు మరో సినిమాకు ఓకే చెప్పారు. గతేడాది మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీ హీరోగా నటించిన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిరంజీవి.  మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను చిరంజీవితో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో మంచి రేటుకు ఈ  రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ మూవీ రూపొందనుంది.

 

కాగా ఇప్పటికే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను 'సాహో' ఫేమ్ సుజీత్‌ కి అప్పగించినట్లు క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా భారీ రేంజ్ లో ఉండేలా స్క్రిప్ట్ రూపొందించామని కోరారట చిరంజీవి. ఇప్పటికే సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాడట. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్  ఖాన్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ‘లూసీఫర్’ చిత్రంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌ తో చేయించాలనుకున్నట్టు వార్తలొచ్చాయి.

 

అయితే తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నాడనేది పుకారే అని తెలుస్తోంది. అసలు మలయాళం రీమేక్ లో నటించే ఆలోచనే లేదని సమాచారం. సల్మాన్ ఖాన్ తన సినిమాలతోనే రాబోయే కొన్నేళ్ల పాటు బిజీగా ఉండనున్నాడు.. ఇక వేరే భాషల్లో నటించే తీరికే లేదని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ రోల్ కోసం ఇంకెంతమంది స్టార్ హీరోల పేర్లు తెరమీదకి వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: