అక్కినేని నటవారసుడిగా టాలీవుడ్లో అడుగు పెట్టిన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2009లో జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా.. హీరోగా నాగచైతన్యకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. కథ, కథనం ఆకట్టుకోలేకపోయినా నాగ చైతన్య పాత్రని డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను నిర్మించింది దిల్ రాజునే. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో ఏ మాయ చేసావే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పటికీ.. ఎప్పటికీ బెస్ట్ లవ్ స్టోరీస్ లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి అనడంతో ఏ మాత్రం సందేహం లేదు.
గౌతం మీనన్ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. నాగ చైతన్య కి దక్కిన మొదటి విజయంతో పాటు సమంత మొదటి సినిమా కూడా అదే కావడం సో స్పెషల్ అని చెప్పవచ్చు. ఇక సమంత, నాగచైతన్య మధ్య ప్రేమ చిగురించింది కూడా ఈ సినిమాతోనే. ఏ మాయ చేశావే సినిమా చైతు జీవితాన్నే మార్చేసింది. ఎందుకంటే.. ఫస్ట్ సినిమాతో ఏర్పడ్డ సమంత, చైతు ప్రేమ ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది.
అయిదేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దల అంగీకారం పొంది, ఒకరికి ఒకరు సరిజోడి అని నిర్ధారించుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంటను చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. ఇక సమయంతో రాకతో చైతు మరింత జోరుగా ముందుకు సాగాడు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు తొలిసారి ‘మజిలీ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత నాగచైతన్య తన మేనమామ వెంకటేష్తో కలిసి నటించిన ‘వెంకీ మామ’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.