లాక్ డౌన్ వల్ల ఈపాటికే విడుదలకావల్సిన సినిమాలు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటిటి లకు బాగా అలవాటుపడిపోయారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు
అమెజాన్ ,నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి సంస్థలు మీడియం రేంజ్ సినిమాలకు గాలం వేస్తున్నాయి. అందులో భాగంగా విడుదలకు సిద్ధం గా వున్న సినిమాలను కొనుక్కొని
థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేయాలని నిర్మాతల వెంటపడుతున్నాయి. ఈజాబితాలో నిశ్శబ్దం
సినిమా కూడా వుంది.
ఇటీవలే ఈసినిమా డైరెక్ట్ గా విడుదలకానుందని వార్తలు రాగ నిర్మాతలు ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు గాను ఈసినిమా హక్కులను భారీ రేటుకు సొంతం చేసుకుందట. దాంతో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసేందుకు ప్రైమ్ సిద్ద మవుతుంది. నిర్మాతలకు కూడా ఇందుకే సుముఖంగానే ఉన్నారట. అయితే అనుష్క ఒప్పుకుంటేనే సినిమా డైరెక్ట్ గా ప్రైమ్ లోకి రానుంది. మరి ఇందుకు అనుష్క ఓకే చెపుతుందో లేదో చూడాలి.
హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్క తోపాటు తమిళ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటించగా యువ హీరోయిన్లు అంజలి ,షాలిని పాండే, అలాగే సుబ్బరాజు ,మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. గోపి సుందర్ సంగీతం అందించాడు. కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు తోపాటు తమిళ , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో నిశ్శబ్దం పై మంచి అంచనాలు వున్నాయి.