టాలీవుడ్ యువ నటుడు మెగా కాంపౌండ్ హీరో అయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఇటీవల వరుసగా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు. గత ఏడాది సంక్రాంతి సమయంలో సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ నటించిన ఎఫ్ 2 సినిమా ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత దసరా పండుగ సమయంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేష్ కూడా మంచి సక్సెస్ కొట్టింది. తమిళ్ లో వచ్చిన జిగర్తాండ సినిమాకు అధికారిక రీమేక్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించిన వరుణ్, మాస్ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. 

 

ఇక కొన్నాళ్లుగా బాక్సింగ్ నేపథ్యంలో యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన నటిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ సినిమా అనంతరం మరొక్కమారు వరుణ్, గద్దలకొండ గణేష్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ టాక్. వాస్తవానికి ఇటీవల తన నెక్స్ట్ మూవీ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చేస్తున్నట్లు హరీష్ ప్రకటించారు. అయితే వరుణ్ తో చేయబోయే సినిమా కోసం ఇప్పటికే హరీష్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు చెప్తున్నారు. 

 

ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న పవన్, హరీష్ తో సినిమా చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, ఈలోపు వరుణ్ తేజ్ తో సినిమా చేయాలని భావించాడట హరీష్. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో వరుణ్ తో చేయబోయే సినిమా కథపై కుస్తీ పడుతున్న హరీష్, అతి త్వరలో దానిని పూర్తి చేసి అధికారికంగా ఆ సినిమా గురించి ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పడంలో సందేహం లేదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: