ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల జోరు రోజురోజుకి ఊపండుకుంటోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్పై కనిపిస్తే.. ప్రేక్షకులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీస్టారర్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో స్టార్ హీరోలు మోహమాటం లేకుండా వేరే హీరోలతో స్క్రీన్ పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా.. 2014లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం `మనం`. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలసి నటించిన ఈ సినిమా మల్టీస్టారర్ కంటే ఎక్కువే అని చెప్పుకోవాలి.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించి టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమా అక్కినేని కుటుంబ పెద్ద అయిన స్వర్గీయ నాగేశ్వర్రావుకి చివరి సినిమా కావడంతో.. అక్కినేని ఫ్యామిలీకి తీపి గుర్తుగా నిలిచిపోయింది. ఆరోగ్యం సహకరించకపోయినా.. చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలన్న కోరికతో ఈ సినిమాను పూర్తి చేశారు ఏఎన్నార్. నాగేశ్వరావు, నాగార్జున, నాగచైతన్య, అక్కినేని కోడలు సమంత, గెస్ట్ రోల్ లో అఖిల్ ఇలా అందరు స్క్రీన్పై కనిపించడంతో అప్పట్లో ప్రేక్షకులు పండగ చేసుకున్నారు.
అంతేకాకుండా.. బాలీవుడ్లో రాజ్కపూర్ కుటుంబం తర్వాత మూడు తరాల నటులు కలిసి నటించిన క్రెడిట్ మన టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీకే దక్కుతుంది. అలాగే, తెలుగు సినీ ఇండస్ట్రీలోనే క్లాసికల్ హిట్గా నిలిచింది. దీంతో ఏ కుటుంబానికీ దక్కని అరుదైన ఘనతను అక్కినేని ఫ్యామిలీ సొంతం చేసుకుంది. మరియు భారతీయ చిత్ర పరిశ్రమలో వచ్చిన చిత్రాల్లో ‘మనం’ ఒక స్పెషల్ మూవీ అనిపించుకుంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మనుషుల మధ్య బంధాలు జన్మ జన్మలకీ కొనసాగితే ఎలా ఉంటుందనే ఆలోచనలోంచి పుట్టిన మనంకి అద్భుతమైన కథనం రాసుకుని తెరపైకి ఎక్కించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.