జూనియర్ ఎన్టీఆర్ ఈయనకు టాలీవుడ్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు మాత్రమే కాదు.. మంచి మనసున్న మారాజు అని అందరికీ తెలిసిన విషయమే. అతను పేదలు.. కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉదారంగా ముందుకు వస్తాడు. లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే, పేదలకు సహాయం చేయడానికి ఆయా ప్రభుత్వాలకు ఆయన రూ .75 లక్షలు విరాళంగా ఇచ్చారు. సినీ పరిశ్రమలో రోజువారీ కూలీల సంక్షేమం కోసం కూడా ఆయన తమ వంతు విరాళాన్ని అందించారు.
ఇప్పుడు ఎన్టీఆర్ తన వ్యక్తిగత సిబ్బందికి, ఒక నెల జీతం ముందుగానే చెల్లించారని తెలుస్తోంది. ఈ కష్టకాలం అంతా ఆదుకునేందుకు తారక్ హామీ ఇచ్చారట. ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లయితే తన సిబ్బంది అందరి శ్రేయస్సును చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇది తెలిసిన వారంతా ఎన్టీఆర్ ఉదారతను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
అంతేకాదు… `సాహో ఎన్టీఆర్` అంటూ సెల్యూట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ అవుతోంది. ఎన్టీఆర్ కెరీర్ సంగతి చూస్తే…రాజమౌళి – రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ చిత్రంతో ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `అయినను పోయి రావలె హస్తినకు` సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అంతేకాక ప్రశాంత్ నీల్తో కూడా ఓ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం. అయితే అందులో చాలా భారీ స్థాయిలో ఎన్టీఆర్ కనిపిస్తారట. ఇకపోతే ఎన్టీఆర్ బర్త్ డే మే 20న జరగనున్న సంగతి తెలిసిందే. ఆ రోజు ఇరు టీమ్ లు సర్ ప్రైజ్ ప్లాన్ చేశాయా? అంటే కష్టమేనన్న మాటా వినిపిస్తోంది. అంటే ఆరోజు తారక్ కి సంబంధించిన ఎలాంటి లుక్ రిలీజ్ కాదని తెలుస్తోంది. లేదంటే సీక్రెట్ గా రాజమౌళి ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.