దేశంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి లాక్ డౌన్ ఏప్రిల్ 14వరకు అన్నారు.. కానీ మే 3 వరకు పెంచారు. ఆ తర్వాత కరోనా దేశ వ్యాప్తంగా మరింత పెరిగిపోవడంతో ఆ డేట్ కాస్త 17 వరకు పెంచారు. ఇక తెలంగాణలో అయితే సీఎం కేసీఆర్ 29 వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపారు. లాక్ డౌన్ వల్ల సినీ ఇండస్ట్రీకి ఎక్కడలేని నష్టం వస్తుంది. నటీనటులు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు అంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి వద్ద నుంచి సోషల్ మాద్యమాల్లో రక రకాల పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా నటుడు బ్రహ్మాజీ ఈ మద్య తన గత జ్ఞాపకాలను ఫన్నీ కామెంట్స్ తోపోస్ట్ చేస్తున్నారు.
లాక్ డౌన్ ను రెండుసార్లు పొడిగించిన కేంద్రం, లాక్ డౌన్ 4.0పై సమాలోచనలు సాగిస్తున్న వేళ, ఎంతో మంది మధ్యతరగతి ప్రజలు వేతనాలు లేక, ఇళ్లకే పరిమితమై అవస్థలు పడుతున్నారు. చిరుద్యోగులు, చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎంతో మంది ఇలాంటి వారికి సహాయం చేస్తున్నామంటున్నా పూర్తి స్థాయిలో ఆ సహాయం అందుతుందా అన్నది ప్రశ్న. ఇక దిగువ తరగతి ప్రజలు మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుని పోయారు. లాక్ డౌన్ ను పొడిగిస్తే, తమ పరిస్థితి మరింత ఘోరంగా మారిపోతుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొని వుంది.
ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ వాస్తవికతకు దగ్గరగా ఉండే ఓ పోస్ట్ చేశారు. పేదలు, మధ్యతరగతి వాళ్లపైనే లాక్ డౌన్ ప్రభావం ఉంటుందని భావించనక్కర్లేదని, లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే తమ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందంటూ, చేతిలో చిప్ప పట్టుకుని కూర్చున్న తన పాత ఫొటోను నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే మా పరిస్థితి ఇది.." అంటూ క్యాప్షన్ పెట్టారు.