దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి భయంతో లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ఈ కరోనా కేసులు భారత్ లో నమోదు కావడంతో అప్పటి నుంచి ముందు జాగ్రత్త చర్యగా మాల్స్, థియేటర్లు, మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు అన్నీ బంద్ చేశారు. దాంతో సినిమా షూటింగ్స్, రిలీజ్ లు అన్నీ వాయిదా పడిపోయాయి. దేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు , మాల్స్ ఓపెన్ చేస్తారన్న నమ్మకం సడలిపోతుంది. సిల్వర్ స్క్రీన్పై కాసుల వర్షం కురిపించాల్సిన సినిమాలపై లాక్డౌన్ ప్రభావం గట్టిగానే పడింది. దీంతో నిర్మాతలు డిజిటల్ మాధ్యమాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలు ఇక ఆన్ లైన్లోనే దర్శనం ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమాను ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయనున్నారు. స్ట్రీమ్ పేరుతో తెలుగులో కూడా రానుంది. దీనికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించగా.. కార్తీక్ సుబ్బరాజు నిర్మాతగా ఉన్నారు. మహానటి మూవీతో తెలుగు, తమిళ్ లో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ మూవీ అమెజాన్ ప్రైమ్లో లో రావడం ఫ్యాన్స్ కి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలా దేవి’ కూడా విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. కానీ విడుదల తేదీని మాత్రం చెప్పలేదు.ప్రముఖ గణిత మేధావి శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఆ మద్య క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్ ’ లో విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ కూడా మే 22న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం అయ్యేలా లేదనే వాదన చిత్రవర్గాల్లో వినబడుతోంది.