కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమలు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్ జరగడం లేదు. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా వాయిదా పడింది. దీంతో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ వరుస టిక్టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. తెలుగు సినిమాలపై టిక్ టాక్ వీడియోలు చేయడం కొనసాగిస్తున్నాడు. తాజాగా 'బాహుబలి' చిత్రంలోని 'అమరేంద్ర బాహుబలి అనే నేను' అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన డైలాగ్ చెప్పాడు. 'బాహుబలి' తరహా వేషధారణలో కనిపించిన వార్నర్ ఆ డైలాగ్ చెప్పేందుకు ఎన్నోసార్లు తడబడ్డాడట. ఈ విషయం తనే చెప్పాడు. 'ఈ సినిమా ఏంటో చెప్పుకోండి' అంటూ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్టు చేశాడు. అంతేకాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ని ట్యాగ్ చేసాడు. వార్నర్ చేసిన చేసిన ఈ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ సృష్టిస్తోంది.
డేవిడ్ వార్నర్ తెలుగు చిత్రాలకు ఫిదా అయినట్టున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన టాలీవుడ్ సినిమా పాటలు, డైలాగ్స్కు టిక్ టాక్ చేసి అలరిస్తున్నాడు. ఆయన సతీమణి క్యాండిస్, కుమార్తె ఇవీ కూడా టిక్ టాక్ వీడియోలలో కనిపించడం విశేషం. ఇప్పటికే వార్నర్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్ట బొమ్మా', 'రాములో రాములా' పాటలకు స్టెప్పులేసి అలరించాడు. 'పోకిరి' చిత్రంలోని మహేశ్ బాబు డైలాగు 'ఒక్కసారి కమిటైతే నా మాట నేనే విననంటూ' కూడా సోషల్ మీడియాలో సందడి చేశాడు. మొత్తమ్మీద వార్నర్ ఈ లాక్ డౌన్ లో తెలుగు సినిమాలతో కాలం గడుపుతున్నట్టు అర్థమవుతోంది. టాలీవుడ్ అభిమానుల నుంచి డేవిడ్ వార్నర్కు పలు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాటలకు, డైలాగ్లకు టిక్టాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చాలామంది మహేశ్ బాబు రీసెంట్ సూపర్ హిట్ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్ బ్లాక్' అనే పాటకు వార్నర్ టిక్ టాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి వార్నర్ కూడా రెస్పాండ్ అయ్యాడు. 'అదే ప్రయత్నంలో ఉన్నాను' అంటూ అతను ట్వీట్ చేశాడు. మొత్తం మీద వార్నర్ ఈ లాక్ డౌన్ లో తెలుగు సినిమాలతో కాలం గడుపుతున్నట్టు అర్థమవుతోంది.