వరుస వైఫల్యాలని ఎదుర్కొంటున్న మంచు మనోజ్ కొత్తగా, సరికొత్తగా మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకూ కెరీర్లో సరైన హిట్ అందుకోలేని మంచు వారసుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని విషాదాల వల్ల సినిమాలకి దూరంగా ఉన్న మనోజ్, ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ సినిమాని ప్రకటించేశాడు.

 

నేడు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని విషయాలతో పాటు, వలస కూలీల వెతలు తీర్చడానికి చేస్తున్న సాయం గురించి, ఇంకా తన ఫ్యూఛర్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. అహం బ్రహ్మస్మి అనే డిఫరెంట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇంతవరకూ చూడని మనోజ్ ని చూడబోతున్నామట. 

 

పక్కా ప్రణాళికతో అన్నీ సిద్ధం చేసుకునే బరిలోకి దిగామని చెబుతున్నాడు. వ్యక్తిగత జీవితంలో జరిగిన్న కొన్ని పరిస్థితుల కారణంగా ఇన్నాళ్ళు సినిమాకి దూరంగా ఉన్నానని, ఒక దశలో సినిమాలు మానేస్తున్నట్టు స్టేట్ మెంట్ కూడా ఇచ్చానని.. కానీ ఇప్పుడు నా ఫోకస్ అంతా సినిమాల మీదే ఉందని స్పష్టం చేశాడు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న అహం బ్రహ్మస్మి సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు పెట్టనున్నారట. 

 


యాభైరోజుల పాటు ఈ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారట. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న ఈ సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనుందట. ఎనిమిది నిమిషాల పాటు ఉండే ఫైట్ సీన్ ప్రేక్షకులకి ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వనుందట. ఇప్పటి వరకూ నా సినిమాల్లో కనిపించని, కొత్త మనోజ్ ని చూస్తారని చెబుతున్నాడు. కరోనా వల్ల సినిమా బడ్జెట్ లు తగ్గించుకోవాలని చెబుతున్న తరుణంలో మనోజ్ చేస్తున్నది నిజంగా సాహసమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: