తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నటుడు చిరంజీవి. ఆయన తరవాత ఆయన కుటుంబం నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీ కి పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఆయన వారసుడిగా 2007 లో చిరుత సినిమా తో వెండి తెరకు పరిచయమైయ్యాడు రామ్ చరణ్. ఈ సినిమా మంచి విజయం సాధించినా చరణ్ నటన పై కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నిటిని సవరించుకుని రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన మగ ధీర సినిమాతో ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేయడమే కాక అశేష అభిమానులను కూడా సంపాదించుకున్నాడు రామ్ చరణ్.
మగ ధీర సినిమాతో హీరోగా నిలదొక్కుకున్న రామ్ చరణ్ తర్వాత సినిమాలు ఆరెంజ్, రచ్చ, నాయక్, బ్రూస్లీ, గోవిందుడు అందరి వాడే సినిమాలు ఆశించినంత విజయాన్ని అందించలేదు. దీని తో ఆయన ట్రాక్ కాస్త గాడి తప్పిందనే చెప్పాలి. అయినా నిరాశ చెందకుండా రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీని తో ఆయన కెరీర్ మళ్ళి ఊపందుకుంది. దీని తర్వాత పల్లెటూరి వ్యక్తి పాత్రలో చెవిటి వాడిగా నటించి సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తో తన నట విశ్వరూపాన్ని చూపించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ త్రిపులార్ అనే భారీ ప్రాజెక్ట్ లో అల్లూరి సీతా రామరాజు గా అభిమానులను అలరించేందుకు సిద్దమైయ్యారు. అంతేకాక ఒక వైపు నటుడిగా కొనసాగుతూనే కొణిదెల ప్రొడక్షన్ సంస్థను స్థాపించి నిర్మాతగా మారారు. తన తండ్రి చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ఖైదీ నెం 150 సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన చిరు సినిమాలన్నిటిని రామ్ చరణ్ నిర్మించాడు. ఏది ఏమైనా రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు.