ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తన కెరీర్లో 66వ చిత్రంగా 'క్రాక్' మూవీ చేస్తున్నాడు. తన క్రేజీ కాంబో శృతి హాసన్ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో మరోసారి కలవబోతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా పవర్ ఫుల్ పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. రవితేజ - గోపిచంద్‌ మలినేనిల కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన 'డాన్‌ శీను' 'బలుపు' చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ అంచనాలను పెంచేసింది. మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న 'క్రాక్' చిత్రాన్ని ఈ ఏడాది స‌మ్మ‌ర్లో సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

ఇదిలా ఉండగా దీని తర్వాత మాస్ మహారాజా 'రాక్షసుడు' దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారని వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరూ కలిసి 'వీర' అనే సినిమా రూపొందించారు. ఈ సినిమాని హీరో కోనేరు హవీష్ ప్రొడక్షన్ హౌజ్ లో నిర్మించబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కాస్త బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి బడ్జెట్ అంశంలో చిన్న పాటి అవకతవకలు ఉండడంతో ఈ ప్రాజెక్ట్ అందాకా వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే వరకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది అని సమాచారం. అందుకే ఆ లోపు దీని స్థానంలో రవితేజ మరో ప్రాజెక్ట్ ను చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ - డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కనున్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మరి మాస్ మహారాజా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: