తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డే ఒకరు. మొదట్లో ఆమె చేసిన చిత్రాలు యావరేజిగా నిలవడంతో ఐరన్ లెగ్ అనిపించుకుంది. కానీ డీజే సినిమాతో ఆమె దశ మారిపోయిందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక అప్పటి నుండీ ఆమెకి తిరుగులేదనే చెప్పాలి. అరవింద సమేత, మహర్షి, అలవైకుంఠపురములో.. ఇలా అందరి స్టార్ల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

 

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలతో పాటు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ హీరోగా రాధాక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్న పూజా, అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లోనూ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే తాజాగా మరో తెలుగు సినిమాకి సంతకం చేయనుందని టాక్ వినబడుతోంది.

 

అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేమ కథల్ని కొత్తగా ఎలా చూపించవచ్చో తెలియజేసిన దర్శకుడు హను రాఘవపూడి సినిమాలో పూజా కనిపించనుందట. పడి పడి లేచే మనసు సినిమా తర్వాత హను రాఘవపూడి చాల గ్యాప్ తీసుకున్నాడు. అయితే గ్యాప్ తీసుకున్నప్పటికీ అతడికి మంచి అవకాశమే వచ్చింది. మళయాల స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న డైరెక్ట్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.

 


దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాలో నటించినప్పటికీ, అది హీరోగా కాదు. అందువల్ల హీరోగా తెలుగులో నటించబోతున్నాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాని అనుకున్నారట. ఫోన్ లో చర్చలు కూడా జరిగాయని సమాచారం. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత హైదరాబాద్ చేరుకుని సంతకం చేయడమే ఆలస్యమని అంటున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: