‘ఆర్ ఎక్స్ 100’ సూపర్ సక్సస్ కావడంతో ఒకేసారి వెలుగులోకి వచ్చిన దర్శకుడు అజయ్ భూపతి మంచి బిజీ డైరెక్టర్ గా మారిపోతాడు అని అందరు భావించారు. అయితే జరిగిన పరిణామాలు వేరు. ఈ దర్శకుడు ఎంతో ఇష్టపడి వ్రాసుకున్న ‘మహాసముద్రం’ కథకు నాగచైతన్యను ఒప్పించి మధ్యలో సమంత చేత కూడ ఈ మూవీలో ఒక ప్రత్యేక పాత్రను చేయించాలని అజయ్ భూపతి చేసిన ప్రయత్నాలు కలిసి రాకపోవడంతో ఈ దర్శకుడు దిగాలు పడ్డాడు.


అయితే పట్టువదలని విక్రమార్కుడు లా ప్రయత్నించి ఈకథను మల్టీ స్టారర్ మూవీ కథగా మార్చి శర్వానంద్ ఒకనాటి సిద్ధార్థల కు సరిపోయే విధంగా మార్పులు చేర్పులు చేసి ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వరస విజయాలతో దూసుకుపోయిన శర్వానంద్ ‘పడిపడిలేచె మనసు’ ‘జాను’ లాంటి మంచి సినిమాలలో నటించినా కాలం కలిసి రాకపోవడంతో శర్వా ప్రస్తుతం అవకాశాలు లేని పరిస్థితులలో సిద్ధార్థ్ తో కలిసి నటించే మల్టీస్టారర్ కు ఒకే చెప్పినట్లు టాక్.


ఇక ‘బొమ్మరిల్లు’ సినిమా తరువాత ఒక వెలుగు వెలిగిన సిద్ధార్థ్ నటించిన తమిళ సినిమాలను ప్రస్తుతం తెలుగులో డబ్బింగ్ చేయడానికి కూడ పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితులలో అజయ్ భూపతి చెప్పిన ఈ మల్టీ స్టారర్ కథకు వెంటనే ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పై నిర్మించబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.


ఇప్పటికే అజయ్ భూపతి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను ఈ లాక్ డౌన్ సమయంలో పూర్తి చేసాడు అని అంటున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులలో ఏమాత్రం క్రేజ్ లేని సిద్దార్థ్ రోల్ ని అజయ్ భూపతి ఎలా డీల్ చేస్తాడు అనే విషయం పై ఈ మూవీ సక్సస్ ఆధారపడి ఉంటుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మల్టీస్టారర్ లో ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని ఇప్పటికే సంప్రదించిన ఈ దర్శకుడు మరో హీరోయిన్ గురించి వేటలో ఉన్నట్లు టాక్. లాక్ డౌన్ ముగిసి తిరిగి షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాక ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: