తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకొనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈయన అధిరోహించని శిఖరాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయనాయకునిగా తెలుగు సినీ ప్రతిష్ఠని, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగ పురుషుడు ఎన్టీఆర్ తరాలు మారినా మరిచిపోలేని మహానటుడు ఈయన. తెలుగువారికి రాముడు, కృష్ణుడు అంటే ఆయనే గుర్తుకొస్తారు. తెలుగు వారికే కాదు... ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర.
పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా పాత్ర ఏదైనా.. సంభాషణలు ఎలాంటివైనా అద్భుత నటనతో రక్తి కట్టించడంలో నందమూరి తారక రామారావును మించిన వారు లేరు.. ఉండరు. అందుకే ఆయన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడయ్యారు. ఎన్టీఆర్ తన 44 ఏళ్ల సినిమా జీవితంలో 186 సాంఘికాలు, 13 చారిత్రకాలు, 55 జానపద, 44 పౌరాణిక సినిమాలు చేశారు. ఇక ఈయన తొలి సినిమా ఏదంటే మన దేశం అని టక్కున చెప్పేస్తారు. కానీ అంతకు ముందే ఆయనకు ఓ సినిమా అవకాశం వచ్చిందనే సంగతి చాలామందికి తెలియదు. ఆ సినిమా ‘వింధ్యరాణి’.
సి.పుల్లయ్య ఈ సినిమాకు దర్శకుడు. వింధ్యరాణి సినిమాలో నటించాలని కోరుతూ పుల్లయ్య ఉత్తరం రాశారు. అయితే చిత్రమేంటంటే ఆ అవకాశానికి ఎన్టీఆర్ నో చెప్పారు. ఎందుకంటే అప్పటికి ఆయన బీఏ చదువుతున్నారు. డిగ్రీ చేతిలో ఉంటే తప్ప సినిమా అవకాశాల కోసం ప్రయత్నించకూడదని నిర్ణయించుకోవడమే కారణం. సినీ రంగం అస్థిరమైందనే అభిప్రాయం వల్ల.. ఒకవేళ అందులో రాణించకపోయినా డిగ్రీ ఉంటే ఉద్యోగం చూసుకోవచ్చనేది ఆయన ముందుచూపుగా ఆలోచించారు. కనీసం ఉత్తరానికి ఎన్టీఆర్ బదులు కూడా ఇవ్వలేదు. అయితే పట్టుదలతో దర్శకుడు పుల్లయ్యే స్వయంగా విజయవాడ వచ్చారు. ఆయనెంత నచ్చచెప్పినా ఎన్టీఆర్ మాత్రం మనసు మార్చుకోలేదు. అలా మొదటి సినిమా అవకాశానికి నో చెప్పారు.