టాలీవుడ్ లో నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ కేవలం నటనలోనే కాదు.. వ్యక్తిత్వం, క్రమశిక్షణ, పనిలో అంకితభావం, చతురత కలిగిన వ్యక్తి. ఆయన సెట్ లోకి వస్తే ఒక నిండుదనం వచ్చేదని అంటారు.. అంతే కాదు ఎన్టీఆర్ ని చూస్తే పెద్ద పెద్ద దర్శక, నిర్మాతలు సైతం ఎంతో వినమ్రతతో ఉండేవారట. అయితే ఎన్టీఆర్ సైతం ఎంతో క్రమశిక్షణతో అనుకున్న సమయానికి షూటింగ్ కి చేరుకొని ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకండా చూసేవారట. ఇక ఎన్టీఆర్ తో షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఎవరైనా ఎంతో జాగ్రత్తగా ఉండేవారట.. ఏ చిన్న ఆలస్యం అయినా కూడా ఎన్టీఆర్ తమకు క్లాస్ తీసుకుంటారని భయపడేవారట. ఒకసారి ఎన్టీఆర్, నటి లక్ష్మి తొలిసారిగా కలసి నటించిన సినిమా ‘ఒకే కుటుంబం’. నటుడు నాగభూషణం నిర్మించిన ఈ సినిమాకి ఎ.భీమ్సింగ్ దర్శకుడు.
ఈ నేపథ్యంలో ఒక రోజు షూటింగ్ జరుగుతోంది... ఎన్టీఆర్, కాంతారావు, లక్ష్మి కాంబినేషన్లో సీన్ చిత్రీకరించాలి. అయితే కాంతారావు కొన్ని కారణాల వల్ల షూటింగ్ సమయానికి లేట్ గా వచ్చారట.. వచ్చే ముందు ఎన్టీఆర్ గారు ఉన్నారా? అయ్యో ఈ రోజు నాకు క్లాస్ బాగానే ఉన్నట్టుందని అనుకొని సెట్స్ లోకి వెళ్లారట కాంతారావు. కానీ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తయ్యేవరకు కాంతారావుని ఒక్క మాట కూడా అనలేదట.. పైగా బాగా నటించావని మెచ్చుకున్నారట. ఆ తర్వాత వృత్తిలో క్రమశిక్షణ చాలా ముఖ్యం బ్రదర్ అంటూ క్లాస్ తీసుకొన్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్తో కలసి ‘బంగారు మనిషి’ చిత్రంలో నటించారు లక్ష్మి.
తొలి సినిమా అనుభవంతో ఎన్టీఆర్ సెట్లో రావడానికి ముందే మేక్పతో సిద్ధంగా ఉండేవారు లక్ష్మి. అయితే ఒక రోజు అనుకోకుండా ఆమెకు లేట్ అయింది. దాంతో లక్ష్మీ చాలా భయంతో సెట్స్ లోకి వచ్చిందట.. ఈ రోజు నాకు బాగానే క్లాస్ ఉంటుందని భావించిందట. ఎందుకైనా మంచిది ముందుగానే బ్రతిమలాడితే బెటర్ అని.. ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ‘సారీ సార్.. కొంచెం లేట్ అయింది’ అని చెప్పారు లక్ష్మి. ఎన్టీఆర్ చిరునవ్వుతో ‘ఇట్సాల్ రైట్’ అన్నారు. ‘లేట్గా వచ్చినందుకు మీకు శిక్ష విధించాల్సిందే’ అని ఇంటి దగ్గర నుంచి తన కోసం వచ్చిన టిఫిన్ అంతా ఆమెతో తినిపించారు ఎన్టీఆర్.