మెగా పవర్ స్టార్ రామ్చరణ్ రంగస్థలం సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయాడు. టాలీవుడ్ దశ దిశను మార్చేసిన ఆ సినిమా తర్వాత వినయ విధేయ రామ లాంటి ప్లాప్ సినిమాలో నటించినా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తన నెక్ట్స్ సినిమాలను వరుసగా పట్టాలెక్కించేలా ప్రణాళికతో ఉన్నాడు. అప్పుడే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే సినిమాకు రంగం సిద్ధం అయ్యింది. ఆర్.ఆర్.ఆర్ అయిన వెంటనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ప్రారంభమవుతుంది.
మరి చరణ్ ఏం చేస్తున్నాడు ? ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ ఏ డైరెక్టర్తో సినిమా చేస్తాడన్నది మాత్రం ఇప్పటకీ సస్పెన్స్గానే ఉంది. అయితే చరణ్ ఈ బిగ్ ప్రాజెక్టు తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జెర్సీ సినిమాతో గౌతమ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను హిందీలో అల్లు అరవింద్, దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.
ఇక కొద్ది రోజులుగా చరణ్ నెక్ట్స్ ప్రాజెక్టును గౌతమే డైరెక్ట్ చేస్తాడంటూ సోషల్ మీడియాలో... ప్రధాన మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్పై చర్చలు కూడా జరిగినట్లు ఎవరికి వారు చెప్పేసుకుంటున్నారు. అయితే వాస్తవంగా చూస్తే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదట. ఈ వార్తలు అన్ని మీడియా వాళ్ల అత్యుత్సాహమే అంటున్నారు. త్వరలోనే నిర్మాత, దర్శకుడు, రామ్ చరణ్ మధ్య ఓ మీటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఇక ఆ సమావేశం తర్వాతే ఈ ప్రాజెక్ట్పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.