దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం `మగధీర`. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు సినిమా చరిత్రలో అద్భుత విజయంగా నిలిచిపోయింది. రెండో సినిమా అయినప్పటికీ రామ్చరణ్ ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచాడు. స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. రామచరణ్కు జోడిగా నటించిన కాజల్ అగర్వాల్కు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగు సినిమాకు భారీ తనం అంటే ఏంటో తొలిసారి చూపించిన చిత్రం మగధీర.
అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 2009సంవత్సరంలో జూలై 30న విడుదలై.. టాలీవుడ్లో వందకోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసిన మొదటి చిత్రంగా రికార్డును సృష్టించింది. ఇలాంటి అద్భుత విజయం సాధించిన మగధీర సినిమాను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాలో `ఏం పిల్లాడో వెళదాం వస్తావా` అనే విప్లవ గీతాన్ని .. విరహ గీతానికి వాడారని.. అది కూడా రచయిత వంగపండు ప్రసాద్ రావు అనుమతి లేకుండా పాట తీసుకున్నారని పెద్ద గొడవ జరిగింది. ఎంతోమంది విప్లవ కళాకారులకు స్ఫూర్తి నిచ్చిన ప్రజా గేయాన్ని తనకు తెలియకుండా చిత్రంలో వాడుకున్నారని వంగపండు ఆరోపించారు.
ఈ పాటపై వంగపండు అభిమానులు, విద్యార్థి, విప్లవ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ, ఆ పాటలో ఆ పల్లవిని తొలగించాలని వారు డిమాండ్ కూడా చేశారు. అప్పట్లో ఇది పెద్ద వివాదమే సృష్టించింది. అయితే చివరికి చిత్రయూనిట్ అతనికి నచ్చచెప్పడంతో వివాదం ముగిసింది. ఈ ఒక్కటే కాదు.. ఈ సినిమాకు మరిన్ని వివాదాలు అల్లుకున్నాయి. ఈ సినిమా చండేరి ఆధారంగా రూపొందించారని ఎస్ పి చారి లీగల్ నోటీసును నిర్మాత అల్లు అరవింద్ కు పంపించారు. అలాగే ఈ సినిమాలో విలన్ లాయర్ను పాశవికంగా హత్య చేస్తాడు. ఈ సీన్పై కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఒక న్యాయవాది మా వృత్తిని కించపరిచే విధంగా ఉందని నిర్మాత, దర్శకుడు, హీరోకు నోటీసులు జారీ చేశారు. ఇలా ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. అవన్నీ జయించి మగధీర సినిమా ఘన విజయం సాధించడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి.