సోష‌ల్ మీడియాలో త‌న‌పై జ‌రుగుతున్న దాడిపై మీరా చోప్రా సీరియ‌స్ అయింది. ఆన్‌లైన్ ద్వారా సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. తనకు ఎన్టీఆర్ కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం అన్నందుకు హీరోయిన్ మీరా చోప్రాను ఎన్టీఆర్ అభిమానులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. `వేశ్య`, `పోర్న్‌స్టార్`, `తిరుగుబోతు` అంటూ తీవ్ర‌స్థాయిలో పోస్ట్‌లు పెడుతున్నారు. గ్యాంగ్‌రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులకు కూడా అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో మీరా తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో `బంగారం` వంటి సినిమా చేసిన మీరా చోప్రా ఇటీవల ట్విటర్ ద్వారా అభిమానులతో మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా `తెలుగులో మీ అభిమాన హీరో ఎవర`ని ఆమెను ఒక‌రు ప్రశ్నించారు. దీనికి స్పందించిన మీరా.. హీరో మహేశ్‌బాబు పేరు చెప్పింది. అనంతరం జూనియ‌ర్ ఎన్టీయార్ గురించి ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మీరా.. `నేను ఎన్టీయార్ ఫ్యాన్‌ని కాదు. ఎన్టీయార్ కంటే మహేష్ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం` అని మీరా చోప్రా పేర్కొంది. దీంతో ఎన్టీయార్ అభిమానులు మీరాపై తీవ్ర పదజాలంతో దూషణకు దిగారు.

 

ఈ నేప‌థ్యంలో ఎన్టీయార్ అభిమానులపై మీరా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఎన్టీయార్ కంటే మహేష్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పినందుకు ఇలా తిడతారా..? అంటూ ప్రశ్నిస్తోంది. ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. `తారక్.. మీ కంటే మహేష్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పినందుకు నన్ను `వేశ్య`, `పోర్న్‌స్టార్`, `తిరుగుబోతు` అని ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదు. మా పేరెంట్స్‌కు కూడా మీ అభిమానులు ఇలాంటి మెసేజ్‌లే పెడుతున్నారు. ఇలాంటి అభిమానుల‌తో మీరు విజయవంతమైనట్టు భావిస్తున్నారా? మీరు నా ట్వీట్‌కు స్పందిస్తారని అనుకుంటున్నా` అంటూ మీరా ట్వీట్ చేసింది. ఎన్టీయార్ అభిమానులు పెడుతున్న ట్వీట్‌ల స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: