కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడుతోంది. సినిమా రంగంపైనా ప్రభావం మరీ ఎక్కువగా పడింది...కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా అనేక రంగాలకు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇస్తూ వస్తోంది. అయితే సినిమా రంగానికి మాత్రం ఇప్పట్లో సడలింపులు ఇచ్చేట్లుగా కనబడటం లేదని తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై మరోసారి సమీక్షించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు సినిమా థియేటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారట. ఈ నెలాకరు వరకు సినిమా థియేటర్లు మూసివేయించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి ఐదు రోజుల క్రితం భారతీయ చలన చిత్ర సీమకు చెందిన అన్నిభాషాల్లోని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కేంద్ర ప్రభుత్వానికి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
అయితే దీనిపై కేంద్ర మంత్రి జావదేకర్ ఆయా సంఘాల ప్రతినిధులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో జవదేకర్ చాలా స్పష్టంగా థియేటర్ల తెరిచే విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్ తర్వాతే పరిశీలిస్తామని ప్రకటించారు. అంటే దాదాపుగా జూలైలోనే థియేటర్లు తెరవాలా..? వద్దా..? అన్నది తేలనుందన్నమాట. ఇదిలా ఉండగా దేశంలో కరోనా ఉధృతి తగ్గకపోతే మరికొన్ని నెలలపాటు సినిమా థియేటర్లను మూసివేసే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఒకేరోజు 9వేలకు పైగా కేసులు, 260 మరణాలు చోటు చేసుకున్నాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. గడచిన 24 గంటలలో అత్యధికంగా 9,304 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒకేరోజు 260 మంది మృతిచెందారు.. ఇప్పటివరకు దేశంలో2,16,919 కేసులు నమోదయ్యాయి. అలాగే మరణించినవారి సంఖ్య 6,075కు పెరిగింది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,06,737 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనాబారిన పడి కోలుకుని ఇప్పటి వరకు దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 1,04,107 మంది డిశ్చార్జ్ అయ్యారు.