ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి సిని ఇండస్ట్రీకి ఆర్థికపరమైన కష్టాలే కాదు.. ప్రముఖులు కూడా మరణిస్తున్నారు.  గత నెల ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ కన్నుమూశారు. ఆ తర్వాత పలువురు బాలీవుడ్ కి చెందిన నిర్మాత ఇతర సాంకేతిక వర్గానికి చెందన వారు.. ఇతర భాషా నటులు కన్నుమూశారు. తాజాగా బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ క్యాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ (28) మృతి చెందాడు.

 

మెదడులో రక్తస్రావంతో గత నెల 31న ముంబైలో తుదిశ్వాస విడిచినట్టు తాజాగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు వచ్చిన వార్తలను ఆయన మేనమామ సునీల్ భల్లా ఖండించారు.  క్రిష్ కపూర్ తన తల్లి, భార్య, ఏడేళ్ల పాపతో కలిసి జీవిస్తున్నాడు. మహేష్‌ భట్‌ నిర్మాతగా వ్యవహరించిన ‘జలేబీ’, కృతి ఖర్బందా నటించిన ‘వీరే కి వెడ్డింగ్’‌ వంటి సినిమాలకు క్రిష్‌‌ కాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.   

 

అయితే బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్న క్రిష్ కపూర్ సబర్బన్ మీరా రోడ్డులోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని తెలిపారు. మరోవైపు, సీనియర్ పాటల రచయిత అన్వర్ సాగర్ (70) నిన్న మధ్యాహ్నం మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: