కరోనా లాక్ డౌన్ తో ప్రజతంలో గడప దాటలేని పరిస్థితి ఏర్పడింది. భారత్లో కూడా దాదాపు 60 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. సినీ రంగం కూడా పూర్తిగా షట్ డౌన్ కావటంతో, థియేటర్లు, సీరియల్స్ కూడా ఆగిపోవటంతో ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ను ఆశ్రయిస్తున్నారు. దీనికి సంబంధించి గూగుల్ ఇండియా ఓ సర్వే చేసింది.
ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్లో వీడియోలు చూస్తున్నవారి సంఖ్య ఏ స్థాయిలో పెరిగింది. ఏ భాషల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు అనే లెక్కలు ప్రకటించింది. ఇండియన్స్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆన్లైన్లో వీడియోలు చూస్తున్నారు. వీళ్లు కూడా రోజుకు గంటపాటు ఆన్లైన్లో వీడియోలు చూస్తున్నట్టుగా తెలిపింది గూగుల్. `అండర్ స్టాండింగ్ ఇండియాస్ ఆన్ లైన్ వీడియో వ్యూయర్` అనే పేరుతో ఈ సర్వేను చేపట్టింది గూగుల్.
ఈ సర్వే లెక్కల ప్రకారం భారతీయులు హిందీ వీడియోలను ఎక్కువగా చూస్తున్నారని తేల్చింది. దాదాపు 54 శాతం మంది బాలీవుడ్, హిందీ భాషలో వీడియోలను చేస్తున్నారు. 16 శాతం మంది ఇంగ్లీష్ వీడియోలను చూస్తున్నారు. తెలుగు వీడియోలు చూసేవారి సంఖ్య మూడో స్థానంలో నిలిచింది. దాదాపు ఏడు శాతం మంది తెలుగు వీడియోలు ఆన్లైన్ లో వీక్షిస్తున్నారు. ఆ తరువాతి స్థానంలో కన్నడ ఆరు శాతం, తమిళ వీడియోలను ఐదు శాతం, బెంగాళీ వీడియోలను మూడు శాతంగా వ్యూయర్ షిప్ సాధించాయి.
అంతేకాదు ముందు ముందు ఆన్లైన్లో వీడియోలు చూసే వారి సంఖ్య భారీగా పెరిగే అవకావం ఉందని గూగుల్ అంచనా వేసింది. వచ్చే ఏడాది కాలంలో ఈ నెంబర్ 500 మిలియన్లకు వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి 37 శాతం ప్రజలు ఆన్లైన్లో వీడియోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారట.