సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వెండి తెరకు అలుముకున్న కన్నడ కస్తూరి. కాటుక కళ్లతో మెస్మరైజ్ చేసే సౌందర్య లహరి ఈ స్వప్న సుందరి. ఈ తరం ప్రేక్షకులకు మహానటి సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ ఆకట్టుకుంటుంది. గ్లామర్ కన్నా యాక్టింగ్ గ్రామర్ తెలుసుకుని సినీ చరిత్ర పుస్తకంలో తనకంటూ ఓ పేజీని కేటాయించుకున్న అందాల అభినేత్రి సౌందర్య.
కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. సౌందర్య అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఎంతో కృంగదీసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సౌందర్య మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద షాపం అనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. నటన పరంగా ఎందరినో ఆకట్టుకున్న సౌందర్య కెరీర్లో ఎన్నో బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా అంతఃపురం సినిమాలో ‘అసలేం గుర్తుకురాదు.. నా కన్నుల ముందర నీవుండగా’ పాట ముందు వరసలో ఉంటుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, సౌందర్య, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించారు.
ఇది ముఠా కక్ష్యల నేపథ్యంలో తీసిన చిత్రం. ఆ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అయితే ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇందులో `అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా.. అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా` అనే సాంగ్ సౌందర్య కెరీర్ లో ఇప్పటికీ.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాటగా నిలుస్తుంది. అంతలా ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటలో సాయి కుమార్కు జోడీగా సౌందర్య పలికే హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సముంద్రంపై ఓ షిప్లో నిర్మించిన ఈ గొప్ప మెలోడీ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుందంటే ఈ సాంగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.