హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన మాస్ మసాలా చిత్రం ఇస్మార్ట్ శంకర్. తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాతో అరాచకం సృష్టించాడు. ఈ చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. పూరి ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సీనియర్ హీరోయిన్ చార్మి కూడా నిర్మాణంలో ఇన్వాల్వ్ అయింది. వాస్తవానికి టెంపర్ సినిమా తరువాత హిట్ ముఖమే చూడని పూరి.. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ రామ్ని హీరోగా ఎంచుకుని ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మేకింగ్, రామ్ ఇస్మార్ట్ యాక్టింగ్తో సినిమా పెద్దపులిలా బాక్సాఫీస్పై యుద్దం చేసింది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ .. డ్యాన్స్.. ఫైట్స్ ఇలా అన్ని సీన్స్ లోను రామ్ ఫుల్ ఎనర్జీతో రెచ్చిపోయాడనే చెప్పాలి. దీంతో చాలా రోజుల తర్వాత మాస్ ఆడియన్స్ని ఈ చిత్రం డాన్సులు చేయించింది. మరియు థియేటర్లలో విజిల్స్, గోలలు చేస్తూ ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. డైలాగ్స్, డాన్సులు, యాక్షన్ సీక్వెన్సులు అన్నింట్లో పూరీ మార్క్ కనిపించింది. కథ రొటీన్ గానే ఉన్నా కూడా కథనం బాగుండటంతో ఫస్టాఫ్ కే పైసా వసూల్ అయిపోయింది.
కానీ, సెకెండాఫ్లో అసలు కథ మొదలైంది. ఒకరి మైండ్ తీసి మరో వ్యక్తికి పెట్టిన తర్వాత కూడా ఓసారి అలా.. మరోసారి ఇలా అంటూ కన్ఫ్యూజ్ చేసాడు పూరీ జగన్నాథ్. అసలు ఇలా ఉంటారా అనే లాజిక్స్ అడక్కూడదు.. ఎందుకంటే అక్కడ లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మాస్ అనే ముద్రలో ఆయన చేసిన మ్యాజిక్ మాత్రమే చూడాలంతే. రొటీన్ కథకే దిమాక్ చేంజ్ అనే లైన్ జోడించి కొత్త టచ్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద విధ్వంశం సృష్టించింది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ ఫుల్ రన్లో 37.50 కోట్లు వసూలు చేసిందంటే బాక్సాఫీస్ దగ్గర శంకర్ ఎంత రచ్చ చేసిందో అర్థం చేసుకోవచ్చు.