రామానంద్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’ వీక్లీ టెలీ సీరియల్ గురించి తెలియని వారు అరుదు. లాక్ డౌన్ సందర్భంగా ప్రస్తుత జనరేషన్ కు కూడా పరిచయమైందీ సీరియల్. అప్పట్లో టీవీల్లో రాముడు, సీత కనిపించగానే టీవీలకే హారతులు పట్టేసేవారు. ప్రస్తుతం ఈ సీరియల్ మళ్లీ జనాదరణ పొందడంతో సీత పాత్ర పోషించిన దీపికా చిక్లియా ప్రజలకు చేరువయ్యారు. సోషల్ మీడియా విస్తృతం కావడంతో సీరియల్ నాటి పలు అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో వారికి ఎదురైన ఓ అనుభవాన్ని తన ఇన్ స్టా అకౌంట్ లో పంచుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ఆ సందర్భంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు దీపికా. ‘ఆ సమయంలో తాము షూటింగ్ కు సిద్దమయ్యాం. ఒక పెద్ద మర్రిచెట్టు కింద నేను, రాముడు, లక్ష్మణుడు ఉన్న సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. మేమందరం చెట్టు కిందే కూర్చుని డైలాగ్ పేపర్స్ తో ప్రిపేర్ అవుతున్నాం. ఆ క్షణంలో కెమెరామెన్ అజిత్ నాయక్ వచ్చి వెంటనే మమ్మల్నందరినీ అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని కోరారు. దర్శకుడు సాగర్ తో పాటూ మాకేం అర్ధం కాలేదు. చెట్టుపైన పాము ఉంది. త్వరగా వచ్చేయండి అని అజిత్ అరిచారు. చూస్తే.. చాలా పెద్ద పాము కనిపించింది. వెంటనే ఒక్క ఉదుటున అక్కడి నుంచి పరెగెత్తాం’ అని చెప్పుకొచ్చారు దీపికా.
తొంభై దశకం తొలినాళ్లలో ఈ సిరియల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా జంటకు చాలా పేరొచ్చింది. ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే ఈ సిరియల్ కోసం అప్పట్లో ప్రజలంతా టీవీల ముందు వాలిపోయేవారు. ప్రస్తుతం దీపిక పంచుకున్న సీరియల్ అనుభవాలు నెటిజన్లతోపాటు ఆతరం వారు ఆసక్తిగా వింటున్నారు.