నేడు బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్.. బలవన్మరణానికి పాల్పడిన తీరు అందర్నీ కలిచివేస్తున్నది. అయితే ఈ హీరో అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడిన వైనం మానసిక రుగ్మతలను బయటపెట్టింది. ఎంఎస్ ధోనీ, చిచోరే, కేదార్నాథ్ సినిమాలతో.. సుశాంత్ తన అభిమానుల్ని విశేషంగా అలరించాడు. కెరీర్ పరంగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. వెండితెరపై నటనతో మంచి మార్కులు తెచ్చుకున్న బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉన్నత విద్యనభ్యసించాడు. పోటీ పరీక్షల్లో చాలాసార్లు టాపర్గా కూడా నిలిచాడు. చదువుకునే రోజుల్లో జీనియస్ అని పేరు తెచ్చుకున్న సుశాంత్ జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఫిజిక్స్లో విజేతగా నిలిచాడు. చిన్న నాటి నుంచి హీరోగా కావాలన్న ఆశ సుశాంత్ కి ఉండేది.
ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్లో ప్రవేశాలకు నిర్వహించే ఏఐఈఈఈ(AIEEE) ప్రవేశ పరీక్షలో సుశాంత్ ఆల్ ఇండియా ఏడో ర్యాంకు సాధించాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ ధావర్ దగ్గర సుశాంత్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. మొదట కొరియో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించాడు. 'కిస్ దేశ్ మే హై మేరా దిల్' అనే టీవీ సీరియల్తో బాలీవుడ్ హీరో సుశాంత్ తన నటనా జీవితం ప్రారంభమైంది. టీవీ నటుడుగా కెరీర్ ప్రారంభించిన సుశాంత్ వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
2013లో అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన 'క్యా పో చే' సినిమాతో సుశాంత్ బాలీవుడ్లోకి అడుగుపెట్టగా..అందులో తన నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. తన అద్భుత నటనతో అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కేదార్నాథ్, చిచోరే లాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేసి ప్రేక్షకుల ఆదరణ పొందాడు. 'ధోనీ' సినిమా విజయవంతంకావడంతో బాలీవుడ్లో ఒక పెద్ద స్టార్గా సుశాంత్ ఎదుగుతాడని అంతా భావించారు.