జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది అయిన తరువాత కానీ టాలీవుడ్ కి తీరుబాటు దొరికింది కాదు, ఆయన అలా ఇలా గెలవలేదు, బంపర్ మెజారిటీతో గెలిచారు. అయినా ఏ సినీ ప్రముఖుడూ తొంగి చూడలేదు, కనీసం మీడియా ముఖాన్నైనా గ్రీట్ చేయలేదు. ఇక ఏపీ గత ఏడాదిగా ఎన్ని కష్టాలు పడినా కూడా టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణాలో ఉండి పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు చూసుకుంటే ఈ మధ్య వీర విజ్రుంభణ చేస్తున్న కరోనా వైరస్ వల్ల ఏపీ దారుణంగా ఇబ్బందులు పడుతోంది.
దాంతో ఏపీకి భారీగా అర్ధిక సాయం చేసేందుకు కూడా టాలీవుడ్ నుంచి పెద్దగా చేతులు రాలేదు. సీసీసీ అని ఒకటి ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆదుకున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు టికెట్లతో సొమ్ము చేసుకున్న వారిలో సినీ పెద్దలు అనేకులు కనీసం కోటి రూపాయల సాయం కూడా చేయలేకపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఇక ఇవన్నీ పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి తో వచ్చిన బడా నిర్మాతల కమిటీ తమకు కావాల్సిన వాటినే మాట్లాడుకుని వెళ్ళిందని సినీ నిర్మాత నట్టి కుమార్ అంటున్నారు. చిన్న నిర్మాతల ఊసు కానీ ధ్యాస కానీ ఎవరికీ పట్టలేదని వాపోయారు. సినిమా స్టూడియోలకు భూములు తీసుకుంటే సినీ కార్మికుల కడుపులు నిండుతాయా అన్నది కూడా చర్చగా ఉంది.
దాంతో చిన్న నిర్మాతల తరఫున త్వరలో తాము ముఖ్యమంత్రి జగన్ని కలుస్తామని ఆయన అంటున్నారు. జగన్ కి సినిమా పరిశ్రమ గురించి పూర్తి అవగాహన ఉందని, అక్కడ జరిగే విషయాలు అన్నీ కూడా ఆయనకు తెలుసు అంటున్నారు. దాంతో తాము వెళ్ళి చిన్న సినిమా బతకడానికి ఏం చేయాలి. ఏం సాయం కావాలి అన్న దానిమీద జగన్ తో చర్చిస్తామని నట్టి కుమార్ అంటున్నారు.
మొత్తానికి సినీ పెద్దగా మెగాస్టార్ వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ తో చర్చలు జరిపారని అంటూంటే కాదు, చిన్న నిర్మాతలను వదిలేశారని నట్టి కుమార్ లాంటి వారు అంటున్నారు. అంటే టాలీవుడ్లో చెప్పకనే ఓ భారీ చీలిక ఉందని తెలుస్తోంది. మరి నట్టి కుమార్ నాయకత్వంలోని చిన్న నిర్మాతల కమిటీకి జగన్ అపాయింట్మెంట్ ఇచ్చి కలిస్తే టాలీవుడ్లో రెండవ వైపు కోణం కూడా బయటపడుతుందని అంటున్నారు.