బాలీవుడ్ యువ నటుడు, ఎంతో భవిష్యత్తు ఉన్న హీరో, మరెన్నో పాత్రల ద్వారా అభిమానులకి ఆనందం పంచాల్సిన హీరో సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడం ఎవ్వరూ జీర్ణించుకోలేనిది. ఎమ్ ఎస్ ధోనీ సినిమాలో ధోనీలా కనిపించి క్రికెట్ అభిమానులనే కాదు, ప్రతీ ఒక్కరినీ మెస్మరైజ్ చేసిన సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని బెడ్ మీద కుప్పకూలిపోయాడన్న వార్త యావత్ సినీ ప్రపంచాన్నే షాక్ కి గురి చేసింది.

 

 

ఈ విషయమై బాలీవుడ్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణానికి బాలీవుడ్ పెద్దలే కారణమంటూ కొందరు, బాలీవుడ్ లోని బంధుప్రీతి వల్లే సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడని, అందువల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్ పై కోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరి ఇది ఎక్కడి వరకూ దారితీస్తుందో చెప్పలేం.

 

అయితే తాజాగా సుశాంత్ సింగ్ చివరి చిత్రమైన దిల్ బేచరా ని ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. థియేటర్లో రిలీజైన సుశాంత్ చివరి చిత్రం చిచోరే మాత్రమే. ఆ తర్వాత డ్రైవ్ అనే మూవీ చేసినప్పటికీ అది డైరెక్టుగా ఓటీటీలో రిలీజైంది. అందువల్ల ఆ సినిమా వచ్చిందన్న విషయం జనాలకి తెలియదు. అయితే ప్రస్తుతం దిల్ బేచరా చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సుశాంత్ అభిమానులు తమ రిక్వెస్ట్ ని వెలిబుచ్చుతున్నారు.

 

 

దిల్ బేచరా సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేయాలని కోరుతున్నారు. సుశాంత్ లాస్ట్ చిత్రాన్ని థియేటర్లో చూసి ఘననివాళి తెలుపుతామని అంటున్నారు. మరి చిత్ర నిర్మాతలు అభిమానుల మాట ప్రకారం థియేటర్లు తెరుచుకునే వరకూఈ అగుతారా లేదా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులని చకచకా జరుపుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: