తెలుగు, తమిళ, మలయాళం మొదలైన భాషల్లో దాదాపు పన్నెండువందల సినిమాలకు సంగీతం అందించిన మహానుభావుడు ఎమ్మెస్ విశ్వనాథన్. ఆయన జూన్ 24, 1928లో జన్మించారు. ఆయన జూలై 14, 2015లో మరణించారు. అయితే ఆయన జీవితాంత సంగీత అభిమానులను ఏదో ఒకరూపంలో అలరిస్తునే వచ్చారు. అనేక మంది గాయకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయనది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరిగా చెప్పవచ్చు. విశ్వనాథన్ కేరళ రాష్ట్రంలో పాలక్కాడ్ తాలూకాలో ఎలప్పళి గ్రామంలో సుబ్రమణియణ్, నారాయణి కుట్టి లకు జూన్ 24, 1928 తేదీన జన్మించాడు. మూడేళ్ల వయసులోనే తండ్రి, సుబ్రమణియణ్ చనిపోతే, దక్షిణ కణ్ణనూరులో ఉన్న తాతగారి వద్ద పెరిగాడు. తాతగారు ఆ ఊళ్లో జైలు వార్డెన్. నీలకంఠ భాగవతార్ గారి దగ్గర మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకున్నాడు.
పదమూడేళ్ల వయసులోనే మూడు గంటల పాటు నిర్విరామంగా సంగీత కచేరి చేసి అందరి ప్రశంసలు పొందాడు. జైలు డే రోజు ఖైదీలతో "హరిశ్చంద్ర" నాటకం వేయించారు, అందులో లోహితాస్యునిగా విశ్వనాధన్ అదరగొట్టేశాడు. దానితో ఖైదీలందరూ సినిమాలలో ప్రయత్నించు అని ప్రోత్సహించారు. అది 1941వ సంవత్సరం. ఆ రోజు విజయదశమి, మద్రాసులో తొలిసారి పాదం మోపాడు విశ్వనాధన్. మేనమామ సహాయంతో, జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎమ్.సుందరం చెట్టియార్, మొహిద్దీన్ లను కలిశాడు. న్యూటోన్ స్టూడియాలో మెకప్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నీవు పనికిరావు, మళ్ళీ తర్వాత చూద్దాం అని చెప్పి వెళ్లిపోయారు. అదే నిర్మాతలను కలిసి, అక్కడే ఆఫీస్ బాయ్ గా పనిచేయడం మొదలుపెట్టాడు.
ఓ పక్క ఆఫీస్ బాయ్ గా చేస్తూనే మరో పక్క జూపిటర్ సంస్థ తీసిన "కుబేర కుచేల" సినిమాలో సేవకునిగా చిన్న వేషం వేశాడు. నటుడు కావడానికి తన ఆకారము, పర్సనాలిటి సరిపోదని తనకే అర్ధమైపోయింది. అందుకే సంగీత విభాగంలొనే కృషి చేసి పైకి రావాలని నిర్ణయించుకున్నాడు. కేవీ మహదేవన్ పరిచయం..ఆ తర్వాత పరిణామల్లోనే కొన్ని కష్టాలు తర్వాత ఇండస్ట్రీలో కొద్దిగా నిలదొక్కుకోగలిగారు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఎమ్జీఅర్ హీరోగా "జనోవా" అనే సినిమాకి సంగీత దర్శకత్వం చేసే అవకాశం విశ్వనాధన్ కు వచ్చింది. అలా మొదలైన ఆయన ప్రస్తానం వేల సినిమాలకు సారథ్యం వహించేలా చేసింది. విశ్వనాధన్ సోలోగా 700 సినిమాలకు (తమిళం 510, మలయాళం -76, కన్నడం - 3, తెలుగులో 70) పైగా స్వర సారథ్యం వహించడం గమనార్హం.
సుదీర్ఘకాలం సినిమా ఇండస్ట్రీకి సేవలందించిన విశ్వానాథన్ 2015 జూలై 14 (వయసు 87)న మూత్రపిండాల క్యాన్సర్తో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.