జగపతి బాబు, ఆమని, రోజా కలసి నటించిన కుటుంబం కథా చిత్రం `శుభలగ్నం`. 1994లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత. దాదాపుగా 25 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరియు రెండు ఫిలింఫేర్ అవార్డులు కూడా ఈ చిత్రం సొంతం చేసుకుంది. అదే సమయంలో జగపతిబాబును ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ చేసింది. ఈ చిత్రంలో ఆమని తన భర్త అయిన జగపతి బాబుని డబ్బుకు ఆశపడి పరాయి స్త్రీ అయిన రోజా కు రూ . కోటికి అమ్మేస్తుంది.
ఆ తరువాత తన తప్పు తెలుసుకుని భర్తని వదులుకున్నందుకు బాధపడుతుంది. అప్పట్లోనే కోటి రూపాయల కోసం భర్తను వేరే వ్యక్తిని అమ్మేసిన కథ అది. ఆమని, రోజా మధ్యలో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడ్డ భర్త కథ. ఈ చిత్రంలో జగపతి బాబు భార్యలుగా రోజా, అమని ఇరగదీశారని చెప్పాలి. ఒకరిని మించి ఒకరు ఎక్కడా తగ్గకుండా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకర్షించింది. దీంతో రోజా, ఆమని కెరియర్ కి కూడా ఈ సినిమా ఎంతో హెల్ప్ అయిందని చెప్పాలి.
ఇక మంచి కథా, కథనంతో ఎస్.వీ.కృష్ణారెడ్డి గారు తెరకెక్కించిన ఈ సినిమా ఒక సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా, మహిళా ప్రేక్షకాదరణతో ఈ చిత్రం వంద రోజులు ఆడింది. కామెడీతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ ను సమపాళ్లలో తెరకెక్కించే కృష్ణారెడ్డి పేరు మరింతగా మోగిపోయింది. వైజయంతీ బ్యానర్ లో ఓ క్లాసిక్ ఫ్యామిలీ మూవీగా నిలిచిపోయింది. అలాగే ఈ సినిమాలో డబ్బు గురించి సిరి వెన్నెల గారు రాసిన పాటలు అయితే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.