రీ ఎంట్రీ మెగాస్టార్ చిరంజీవి సినిమాల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తన వయసుకు, ఇమేజ్ తగ్గ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమా చేసిన చిరు, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు నక్సలైట్గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆచార్య షూటింగ్కు బ్రేక్ పడింది.
అయితే ఆచార్య తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు చిరంజీవి. ఈ సినిమాకు సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే సుజిత్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కీలక మైన లేడీ క్యారెక్టర్ విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది.
మలయాళంలో మంజు వారియర్ నటించిన పాత్రను తెలుగులో ఎవరు చేస్తారన్న చర్చ జరుగుతోంది. ముందుగా ఈ పాత్రకు విజయశాంతిని తీసుకుంటారన్న టాక్ వినిపించింది. సరిలేరు నీకెవ్వరు వేడుకలో చిరు, విజయశాంతిలు ఆప్యాయంగా మాట్లాడుకోవటంతో అంతా నిజంగానే మరోసారి కలిసి నటిస్తారని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపించటం లేదు.
దీంతో ఆ పాత్ర సుహాసిని అయితే ఎలా ఉంటుంది అన్న చర్చ జరిగింది. 30 ఏళ్ల తరువాత చిరు, సుహాసిన కాంబినేషన్ రిపీట్ అయితే ఆ క్రేజ్ ప్లస్ అవుతుందని భావించారు. కానీ తాజాగా ఆ పాత్రకు మరో సీనియర్ హీరోయిన్ను తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంజు వారియర్ పాత్రలో ఖుష్బూ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారట. గతంలో స్టాలిన్ సినిమాలో చిరుకు అక్కగా నటించిన ఖుష్బూ ఇప్పుడు చెల్లెలిగా నటించేందుకు రెడీ అవుతుందట.