ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్(71) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుఝూమున 1.52 గంటలకు గుండెపోటుతో మరణించారు. తన తల్లి గుండెపోటుతో కన్నుమూసిందని ఆమె కూతురు ధ్రువీకరించారు. 71 ఏళ్ల సరోజ్ఖాన్ శ్వాస కోస సమస్యలతో జూన్ 20వతేదీన బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. సరోజ్ ఖాన్ శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది.1974 నుంచి పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్గా సరోజ్ఖాన్ పని చేశారు. మూడుసార్లు ఆమె జాతీయ అవార్డును అందుకున్నారు.
సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి. 1980-90 దశకంలో కొరియోగ్రాఫర్గా పనిచేసిన సరోజ్ ఖాన్.. శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి పాప్యులర్ హీరోయిన్లతో అదిరిపోయేలా స్టెప్పులు వేయించారు. సరోజ్ ఖాన్ చివరిసారి మాధురి దీక్షిత్ నటించిన ‘కలంక్’ సినిమాలోని కొన్ని పాటలకు నృత్య దర్శకత్వం వహించారు.గత కొన్నేండ్లుగా సరోజ్ ఖాన్ బాలీవుడ్ నుంచి దూరంగా ఉంటున్నారు. దాదాపు మూడేండ్ల తర్వాత 2019 లో తిరిగి వచ్చిన సరోజ్ఖాన్.. కంగనా రనోట్ చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' మాధురి దీక్షిత్ 'కలంక్' లో పాటలకు దర్శకత్వం వహించారు.
ఒకప్పుడు మాధురి దీక్షిత్, సరోజ్ఖాన్ జంట మంచి ఊపులో ఉండేది. వీరి కలయికలో వచ్చిన అనేక పాటలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. మాధురి దీక్షితి నటించిన పాట... చోలీకే పీచే క్యా హై అనే పాట ఇప్పటికీ ఊర్రూతలూగిస్తుండటం విశేషం. సరోజ్ ఖాన్ 1948లో నవంబర్ 22న జన్మించారు. ఆమె అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్. ఆమె తల్లిదండ్రులు కిషన్ చంద్ సధు సింగ్, నోని సధు సింగ్. ఆమె పుట్టిన కొద్ది రోజులకే భారత విభజన జరగడంతో వీరి కుటుంబం భారతదేశంలో స్థిరపడిపోయారు. నజరానా సినిమాలో శ్యామ అనే పాత్రతో బాల నటిగా తెరంగేట్రం చేశారు ఆమె.