కీరవాణి అలియాస్ కోడూరి మరకతమణి కీరవాణి.. ఈ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పేరులోనే రాగాన్ని ఇముడ్చుకున్న స్వరఝరీ కీరవాణి. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధి పొందిన ఈయన.. మనసు - మమత తెలుగు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఇక అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.
అన్నమయ్యను మరిపించి.. రామదాసులా రాముణ్నే రంజింపజేసి.. రాఘవేంద్రుని రసభరిత సినిమాలకు సప్తస్వరాలను అద్ది.. ప్రస్తుతం రాజమౌళితో సురాగయానం సాగిస్తోన్న కీరవాణి పుట్టిన రోజు ఇవాళ. కీరవాణి 1961 జూలై 4 న జన్మించాడు. ఈయన తండ్రి శివశక్తి దత్తా. రామోజీ రావు నిర్మించిన మనసు మమత అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కీరవాణి ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి.. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక దశాబ్దాలు గడుస్తున్నా అలుపెరుగని సంగీత శ్రామికుడు కీరవాణి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
అసలు ఈ వ్యక్తికి రాగం పేరు పెట్టడం ఏంటీ..? అంటే దీని వెనక పెద్ద కథే ఉంది. అదేంటంటే.. 65 ఏళ్ల క్రితం `విప్రనారాయణ` అనే సినిమా విడుదలైంది. పి.ఎస్.రామకృష్ణారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి జంటగా నటించారు. ఈ సినిమాకు మన కీరవాణి గారి నాన్నగారైన శివశక్తి దత్తా వెళ్లారట. ఆ సినిమాలో ఓ పాట ఆయన్ను విపరీతంగా ఆకట్టుకుందట. ఆ పాటే.. `ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా ఇందుకేనా`. ఈ పాటను సముద్రాల రాఘవాచార్య రచించగా భానుమతి గానం చేసింది.
భానుమతి, అక్కినేని నాగేశ్వరరావులపై ఈ పాటను చిత్రీకరించారు. కీరవాణి రాగంలో ఈ పాటను స్వరపరచాడు సంగీత దర్శకుడు. ఆ సినిమా చూసినప్పటి నుంచి రోజులు గడుస్తున్నా.. నెలలు గడుస్తున్నా.. ఏళ్లు గడుస్తున్నా.. ఆ పాట మాత్రం శివశక్తి దత్తా గారుని వదిలిపెట్టడం లేదట. చివరకు ఆ పాటపై ఆయనకు మమకారం ఏ స్థాయికి చేరుకుందంటే.. ఆ సినిమా వచ్చిన ఏడేళ్లకు శిశశక్తి దత్తా గారికి ఓ అబ్బాయి పుడితే.. ఆ బాబుకు `కీరవాణి` అనే నామకరణం చేసేశారు. దానికి కారణం ఆయనకి ఇష్టమైన పాట రాగం అదే కదా.. అందుకు. ఆ విధంగా మన కీరవాణికి ఆ పేరు వచ్చిందన్నమాట. ఇంకేముంది.. రాగం పేరు పెట్టుకున్న కీరవాణి రాగాలవాడైపోయాడు. చివరిగా.. శ్రీ స్వర మాంత్రికుడు..కీరవాణి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..!!