నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎంతో చరిత్ర ఉన్న నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా కళ్యాణ్ రామ్ ఏనాడు ఇసుమంత అయినా గర్వం చూపలేదు. చాలా సింపుల్గా ఉండే కళ్యాణ్ రామ్ ఏ నాడు చిన్న వివాదంలో కూడా తలదూర్చ లేదు. అటు హీరోగా రాణిస్తోన్న కళ్యాణ్ రామ్ తన తాత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు మీదే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.
అప్పట్లోనే ఓం సినిమాను త్రీడీ ఫార్మాట్లో తెరకెక్కించారు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ మార్కెట్కు మించి ఏకంగా రు. 25 కోట్లతో తీశారు. అప్పట్లోనే అది పెద్ద సంచలనం. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితే జ హీరోగా తెరకెక్కిన కిక్ 2 సినిమాకు ఏకంగా కళ్యాణ్ రామ్ రు. 40 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. అది రవితేజ మార్కెట్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్. అయితే కళ్యాణ్ రామ్ సినిమాను నమ్మిన వ్యక్తి కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కారు.
ఇక తన సోదరుడు ఎన్టీఆర్ హీరోగా తన బ్యానర్ లో తొలిసారిగా తీసిన సినిమా జైలవకుశ. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రల్లో నటించారు. ఇది కూడా పెద్ద సంచలనమే. ఎన్టీఆర్ లాంటి క్రేజీ హీరోను ఏకంగా మూడు పాత్రల్లో చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా హీరోగానే కాకుండా తన తాత పేరు మీద బ్యానర్ స్తాపించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాలు తీస్తూ ఈ తరం హీరోల్లో డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యుసర్గా కూడా మంచి పేరను తెచ్చుకున్నాడు కళ్యాణ్ రామ్.