కరోనా పరిస్థితుల మధ్య పెద్ద కంపెనీలు కూడ తమ ఉద్యోగులకు జీతాలివ్వడానికి ఇబ్బంది పడిపోతున్నాయి. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుని జీతాల్లో కోతలు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి బడా నిర్మాణసంస్థలు ఈపరిస్థితుల మధ్య తీవ్ర ఆర్ధిక కష్టాలలోకి వెళ్ళిపోతున్నాయి అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
ఇండస్ట్రీలో చాలవరకు పని ఉంటేనే జీతం ‘నో వర్క్ నో పే’ అన్నట్లుగా ఫిలిం ఇండస్ట్రీ నడుస్తుంది. ఒక సినిమా కోసం ఆఫీస్ తెరిచాకే స్టాఫ్ కు జీతాలిస్తారు. ఆసినిమా పని అయిపోగానే జీతాలు ఆగిపోతాయి. ఈపరిస్థితుల మధ్య బడా నిర్మాణసంస్థలు కూడ పనిలేని సమయంలో జీతాల భారం మోసే పరిస్థితుల్లో ఇప్పుడు లేవు అన్న సంకేతాలు వస్తున్నాయి.
ఇప్పటికే ఇండస్ట్రీలోని చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని ప్రొడక్షన్ హౌస్ లు జీతాలు ఆపేయగా ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ లు మాత్రం స్టాఫ్ కు జీతాలిస్తూ వచ్చాయి అన్నవార్తలు వచ్చాయి. అయితే ఇప్పడు హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ కూడా ఈమధ్య జీతాలు ఆపేసిందని లీకులు వస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులలో కూడ సుకుమార్ పరిస్థితులతో ఎదురీత ఈదుతూ ‘పుష్ప’ టీమ్ సభ్యులకు కనీసం సగం జీతాలు అందేలా తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఈ విషయమై మైత్రీ మూవీస్ సంస్థ వారి పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్.
ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ‘పుష్ప’ కు సంబంధించి నటీనటుల ఎంపిక విషయంలో సుకుమార్ కు అనేకసమస్యలు ఎదురౌతున్నట్లు టాక్. ఈసినిమాలో కీలకపాత్రకు ఎంపిక అయిన విజయ్ సేతుపతి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ మూవీలోని విలన్ పాత్రకుగాను సంప్రదించిన బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ సునీల్ శెట్టిలు మొదట్లో ఈమూవీకి ఓకె చెప్పినా సుకుమార్ ఈమూవీ షూటింగ్ కు సంబంధించి సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో అతడు కూడ ఈమూవీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది..